ఐఏఎస్ అధికారులకు ఎపి ప్రభుత్వం ఝలక్...పనితీరుపై నివేదిక...ఆపై చర్యలు...
విజయవాడ : ఏపీలోని అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరులో ప్రక్షాళన ప్రారంభమైంది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగులైన ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ప్రజలకు ఏమేరకు ఉపయోగపడుతున్నారు...ప్రజల కోసం చిత్త శుద్దితో పనిచేస్తున్నారా...అసలు పనిచేస్తున్నారా లేదా అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక రూపొందించబోతోంది. ఐఎఎస్ అధికారుల పనితీరుపై ఇటీవలి కాలంలో సిఎం చంద్రబాబు ప్రతికూల వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కమిటీ నియామకం జరగడం గమనార్హం.
తమ పనితీరుపై ఎపి ప్రభుత్వం ఒక నివేదిక తయారుచేయబోతోందన్న విషయమే ఇప్పుడు అఖిల భారత సర్వీసు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇన్నాళ్లూ తమ మాటే వేదవాక్కులా భావించిన అత్యున్నత స్థాయి అధికారులు అందరూ ఎపి ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పైగా ఈ నివేదికలో నెగిటివ్ రిపోర్టు వచ్చిన అధికారులపై చర్యలకు కేంద్రానికి సిఫార్సు చేయనున్నట్లు తెలియడం వారిలో ఆందోళన మరింత పెంచేస్తోంది.
ఐఏఎస్ వ్యవస్థ...ప్రక్షాళన ఇలా...
ఇన్నాళ్లూ తాము ఆడిందే ఆట...పాడిందే పాట అన్న చంద్రంగా తమకు నచ్చిన రీతిలో పనిచేస్తూ వస్తున్న అఖిల భారత సర్వీసు అధికారులకు ఎపి ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఝలక్ ఇచ్చింది. ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల పనితీరుపై ఒక నివేదిక రూపొందించాలన్నే ఆ నిర్ణయం. సివిల్ సర్వీస్ అధికారుల పనితీరును సంస్కరించడమే ఈ నివేదిక రూపొందించడం వెనుక ప్రధాన ఉద్దేశం. కేవలం నివేదిక రూపొందించడమే కాదు అందులో తమ పనితీరుపై బాగా నెగిటివ్ రిపోర్టు తెచ్చుకున్న అధికారులపై కేంద్రానికి ఎపి ప్రభుత్వం సిఫార్స చేయనున్నట్లు తెలుస్తోంది.
పనితీరు...మదింపు...
ప్రజలకు పనికి వచ్చే పనులేమీ చేయకుండా కేవల జీతం మాత్రం తీసుకుంటున్నఅఖిల భారత సర్వీసు అధికారులపై తాజాగా వేసిన కమిటీ చర్యలు తీసుకోనుంది. ఇప్పటివరకు మన రాష్ట్రంలో ఈ తరహా కమిటీ లేకపోయినా గతంలో పలు రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. పైగా ఈమధ్య కాలంలో ఎపిలోని సివిల్ సర్వీసెస్ అధికారుల్లో కొందమంది తమ విధులను మనస్పూర్తిగా నిర్వహించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారు కొంతమంది ఉన్నారని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. అలాగే కొందరు ఐఎఎస్ అధికారుల పనితీరుపై వివిధ సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
Recommended Video
నూతన కమిటీ...నివేదిక...చర్యలు
ఇకపై ఎపి ప్రభుత్వం నూతనంగా నియమించిన కమిటీ ద్వారా ఎప్పటికప్పుడు ఈ అఖిల భారత సర్వీసు అధికారులు ప్రజలకు ఉపయోగపడుతున్నారా? లేదా? అన్న విషయాలను మదింపు చేయడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తరువాత ఇప్పటి వరకూ ఇలాంటి మదింపు జరగలేదు. దీంతో తాజాగా ఈ కమిటీని నియమించారు.ఉన్నతాధికారుల సామర్ధ్యాన్ని లెక్కించే కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఛైర్మన్గా ఉండే ఈ కమిటీలో కేరళ హోం శాఖ అధనపు ప్రాధాన కార్యదర్మి సుబ్రతో బిస్వాస్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అఖిల భారత సర్వీసు ఉన్నతోద్యోగులపై కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహరాల శాఖ నిశితంగా అధ్యయనం చేసింది.
చర్యలు...ఇలా...
గతంలో మిగతా రాష్ట్రాల్లో ఇలా రూపొందించిన నివేదికల్లో ప్రజలకు ఉపయోగం లేదని తేల్చిన వారి జాబితాను చర్యల కోసం కేంద్ర శిక్షణ , సిబ్బంది శాఖకు పంపిస్తారు. ఆ శాఖ వారిని పదవీ విరమణ చేయిస్తుంది. కొందరికి జీతాల్లో కోత, మరికొందరికి ఫించన్లలో కోత విధించడం చేస్తుంది. అయితే ఇలా పదవీ విరమణ చేయించడంపై పలువురు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టులోనూ అలాంటి వారికి గతంలో అనేక సందర్భాలలో చుక్కెదురయ్యింది. ఇప్పుడు ఎపి కూడా అఖిల భారత సర్వీసు అధికారుల పనితీరు ప్రక్షాళన కోసం అదే బాట పట్టనుంది.
వేటు పడిందిలా...
ఈ నిబంధనలను అనుసరించి ఇప్పటికే 381 మంది అధికారులని సర్వీసుల నుంచి తొలగించారు. వీరిలో 24 మంది ఐఏఎస్ , ఐపిఎస్లు ఉన్నారు. సర్వీసు నిబంధల్నిఅనుసరించి 15ఏళ్ళు పనిచేశాం ఇక ఎలా ఉన్నా సరిపోతుంది. అనుకుంటే ఇకపై రూల్స్ ప్రకారం కుదరదు. ప్రజాధనాన్ని వారి జీత భత్యాలకు ఉపయోగిస్తున్నందున ప్రజలకు ఏటేటా ఉపయోగ పడాలన్నది సర్వీసు నిభందనల్లో ఉంది. దీని ప్రకారం నిర్ణీత కాల పరిమితుల్లో పనితీరును మదింపు చేస్తుంటారు. పనితీరులో బాగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన ఐఏఎస్లను పదవీ విరమణ చేయించడం, కొందరికి జీతాల్లో కోత, మరికొందరికి ఫించన్లలో కోత విధించడం చేస్తుంది. అలా కాదని ఉద్యోగులు కోర్టుకు ఎక్కితే అటు కోర్టు నుంచి కూడా ప్రభుత్వం తనకు అనుకూలంగా గతంలో వచ్చిన తీర్పులను ప్రస్తావించడానికి సిధ్దం అవుతుంది. దీంతో ఈ నివేదికలో ఎవరి పేర్లు ఉంటాయోనని ఏపిలోని ఐఏఎస్ , ఐపిఎస్ అధికారుల గుండెల్లో గుబులు మొదలైందట.