ఇదీ నాకిచ్చింది, వెళ్తున్నా: జగన్కు వైయస్ సన్నిహితుడి భావోద్వేగ లేఖ, సుబ్రహ్మణ్యం దారెటు?
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెండు రోజుల వ్యవధిలో రెండు షాకులు తగిలాయి. ఆదివారం జెడ్పీ మాజీ చైర్మన్, వైయస్సార్ సన్నిహితులు సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేయగా, సోమవారం రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉన్న మమత రాజీనామా చేశారు.
సుబ్రహ్మణ్య రెడ్డి అయితే గతంలో మూడుసార్లు సీఎం చంద్రబాబు నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. అలాంటి వ్యక్తి వైసీపీకి రాజీనామా చేశారు. అధిష్టానం, స్థానిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కలత చెంది వారు పార్టీని వీడారు. కాగా, ఇప్పుడు వీరి పయనం ఎటు అనేది చర్చనీయాంశమైంది.
Recommended Video


జగన్కు రెండు పేజీల లేఖ
సుబ్రహ్మణ్య రెడ్డి రాజీనామా చేశారు. ఆయన జగన్కు రెండు పేజీల లేఖ రాశారు. కానీ ఏ పార్టీలో చేరతానో చెప్పలేదు. అలాగే మమత కూడా తన రాజకీయ భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తారని చెప్పారు. వారు ఏ దిశగా అడుగులు వేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.

జగన్కు రాజీనామా కారణాలు చెప్పారు
జగన్కు రాసిన తన రెండు పేజీల రాజీనామా లేఖలో సుబ్రహ్మణ్య రెడ్డి తన ఆవేదనను అంతా వెళ్లగక్కారని తెలుస్తోంది. పార్టీతో ఇన్నాళ్లుగా కొనసాగి అనుబంధాన్ని తెంచుకునే సమయంలో ఆయన ఉద్వేగానికి కూడా లోనయ్యారు. తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తున్నానో జగన్కు లేఖలో వివరించారు.

వైయస్ ప్రాధాన్యత ఇచ్చారు కానీ, మీరు ఆశపెట్టి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తనకు చిన్న పదవుల నుంచి జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వడం వరకు తనకు ఇచ్చిన ప్రాధాన్యతను సుబ్రహ్మణ్య రెడ్డి.. జగన్కు రాసిన లేఖలో వివరించారు. అదే సమయంలో 2014లో మాత్రం తనకు టిక్కెట్ ఇస్తానని చెప్పి బీసీ నేత చంద్రమౌళికి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసి, తనకు అన్యాయం చేసిన విషయాన్ని వెల్లడించారు.

విధేయుడిగా ఉన్నందుకు నాకు లభించిన గౌరవం ఇది
నాకు టిక్కెట్ ఇస్తానని చెప్పి మాట తప్పినప్పటికీ 2014 ఎన్నికల్లో తాను పార్టీ కోసం పని చేశానని, తన కారణంగా కూడా 57వేల ఓట్లు మన అభ్యర్థికి వచ్చాయని, కానీ తాను పార్టీ కోసం పని చేయలేదని చెప్పడం బాధించిందని సుబ్రహ్మణ్య రెడ్డి.. జగన్కు రాసిన పేర్కొన్నారని తెలుస్తోంది. గత ముప్పై ఏళ్లుగా వైయస్కు, ఆ తర్వాత జగన్కు విదేయుడిగా ఉన్నందుకు తనకు లభించిన గౌరవం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. అవమానాలు భరించలేకే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

సుబ్రహ్మణ్య దారెటు, బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
సుబ్రహ్మణ్య రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు కానీ, ఇక మీదట తన రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న విషయంలో ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. మాతృ పార్టీ అయిన కాంగ్రెస్లోనే తిరిగి చేరుతారని కొందరు అంటున్నారు. మరోవైపు, ఇతర నేతలను ఆకర్షిస్తున్న బీజేపీ వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. స్థానికంగా బలం ఉన్న నాయకులను బీజేపీ లాక్కునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం అందిందని అంటున్నారు. కానీ ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు వంటి ఇష్యూల నేపథ్యంలో ఆయన కమలం వైపు వెళ్తారా అనేది ప్రశ్నే అంటున్నారు.

కుప్పంలో వైసీపికి కష్టమే
వైసీపీలో తనకు ప్రాధాన్యం లేదని, ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు ఎంత మధన పడ్డారో ఆదివారం నాడు సభలో ఆయన భావోద్వేగానికి లోనైనప్పుడే తెలిసింది. ఎన్నికలు మరో ఏడాదిన్నరలో ఉండాయనగా వైసీపీనుంచి నిష్క్రమించడం సుబ్రమణ్యంరెడ్డి ఒక్కరికే కాదు, అటు కుప్పంలో ఆ పార్టీకి కూడా కష్టకాలమే అంటున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి సుమారు 57 వేల ఓట్లు రావడం వెనుక సుబ్రమణ్యం రెడ్డికీ, ఆయన అనుచర వర్గానికీ కూడా అందులో భాగం ఉంది. సుబ్రమణ్యం రెడ్డి స్థానికుడు కావడంతో వైసీపీ అభ్యర్థికి ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఈ కోణంలో చూస్తే సుబ్రమణ్యం రెడ్డి రాజీనామా కుప్పం నియోజకవర్గ వైసీపీకి తీరని లోటు అంటున్నారు.












Click it and Unblock the Notifications