ఉపేక్షించేది లేదు - వైసీపీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ నేతలకు ఘాటు హెచ్చరిక చేసారు. డీఎస్సీ అక్రమాల పేరుతో వైసీపీ చేస్తున్న నిరసనల పైన స్పందించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అమరావతిలో రెండు ముఖ్యమైన ప్రారంభోత్సవాలు ఈ నెలలోనే చేయనున్నట్లు చెప్పిన చంద్రబాబు.. రెండు ప్రాజెక్టుల ప్రారంభానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితి పైన ఎప్పటికప్పుడు ప్రజలకు వివరాలు తెలియచేస్తామని స్పష్టం చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉందని.. ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా చేసే నిరసనలను ఏమాత్రం ఉపేక్షించబోమని వైసీపీ నేతలను ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేకంగా ఏం చేసినా ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. వైసీపీ నేతలు ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రహదారుల వెంట నిరసనలు అంటే ప్రభుత్వం ఊరుకోదని సీఎం స్పష్టం చేసారు. వైసీసీ చేస్తున్న నిరసనల్లో ఒక డీఎస్సీ అభ్యర్ధి అయినా ఉన్నారా అని ప్రశ్నించారు. కర్నూలు లో డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు ర్యాలీ చేసారని వివరించారు. వారు తమ అత్మగౌరవం కోసం ఈ ర్యాలీ చేసారని చెప్పారు. ఇక.. ఈ నెలలోనే రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. వెలుగొండ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకూ ఈ నెలలోనే సాకారం అవుతాయని స్పష్టం చేసారు.

అమరావతి కేంద్రంగా రెండు ప్రారంభోత్సవాలు
అదే విధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వచ్చే ఏడాది విశాఖ వరకూ తీసుకెళ్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక.. ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభం అవుతాయని చెప్పారు. సీడ్ యాక్సిస్ రహదారి ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని వివరించారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం జలశయం నిండే అవకాశం ఉందని సీఎం వివరించారు. ఆ తర్వాత నాగార్జున సాగర్కూ నీరు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇకపై ప్రతీ ఏడాది ఆర్దిక పరిస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేసారు. పాలనా పరంగా పరిస్థితులను ఎప్పటికి అప్పుడు ప్రజలకు వివరిస్తామని చంద్రబాబు వెల్లడించారు.



Click it and Unblock the Notifications