మంత్రులకు డెడ్ లైన్ - సింగపూర్ చర్చలు, లిక్కర్ కేసు ఇక.. తేల్చి చెప్పిన చంద్రబాబు..!!
ఏపీ మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించ నున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ విధి విధానాలకు ఆమోద ముద్ర వేసారు. కొత్త బార్ పాలసీ కి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన సింగపూర్ పర్యటన వివరాల పైన మంత్రులకు సీఎం చంద్రబాబు వివరించారు. మంత్రులకు పని తీరు పైన సీఎం కీలక సూచనలు చేసారు. ఉచిత బస్సు పథకం వేళ.. ఆటో కార్మికులను పిలిచి మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ అధికారిక అజెండా తరువాత మంత్రులకు పలు కీలక సూచనలు చేసారు. ఏడాది కాలం పాలన పూర్తి కావటంతో ఇక మంత్రులు సమర్ధవంతంగా పని చేయాలని నిర్దేశించారు. ఇక ఉదాసీనంగా ఉంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. వచ్చే కేబినెట్ భేటీలో మంత్రులు తమ శాఖలకు సంబంధించిన నివేదికలను ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందే ఆటో డ్రైవర్లతో చర్చించాలని మంత్రి మనోహర్ సూచించారు. మంచి సూచనగా పేర్కొన్న చంద్రబాబు.. వెంటనే ఆటో సంఘాలను పిలిచి మాట్లాడాలని నిర్దేశించారు.

సింగపూర్ లో
తన సింగపూర్ పర్యటన గురించి మంత్రులకు చంద్రబాబు వివరించారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాల కారణంగా సింగపూర్ వాళ్లు ఏపీకి రావటానికి సిద్దంగా లేరని వివరించారు. అలాగే సీడ్ క్యాపిటల్లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్కు వాళ్లని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్లు సైతం ఒప్పుకున్నారని చెప్పారు.. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నానని వివరించారు.కొత్త బార్ పాలసీను ఆమోదించారు. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు.
కొత్త జిల్లాలపై
కొత్త జిల్లాల పేర్లు మార్పు ఇతర సాంకేతిక అంశాలపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని సీఎం మంత్రి వర్గ ఉప సంఘానికి సూచించారు. గతంలో ఉన్న గందరగోళ పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. మంత్రి వర్గ ఉప సంఘం వెంటనే సమావేశం అయి కొత్త జిల్లాల పేర్లు.. ఇతర సమస్యలపై దృష్టి పెట్టాలని చంద్రబాబు ఆదేశించారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని 15 న ప్రారంభిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. ఆ రోజున చాలా కార్యక్రమాలు ఉంటాయని.. అయినా, టైమ్ అడ్జెట్ చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని వారికి సీఎం సూచించారు. అదే విధంగా లిక్కర్ కేసుల్లో అరెస్టులపై ఎవరూ మాట్లాడవద్దని.. విచారణకు అనుగుణంగా అధికారులు వ్యవహరిస్తారని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications