ఉచిత ఇసుక అమలు పై చంద్రబాబు తాజా ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇసుక గందరగోళం పై కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక అందుబాటులోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఉచిత ఇసుక అమలులో కొన్ని ప్రాంతాల్లో గందరగోళం కొనసాగుతోంది. స్థానికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. రవాణా ఛార్జీలతో పాటుగా తమకు ఇసుక ఇవ్వటం లేదనే వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తాజాగా అధికారులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేసారు.
చంద్రబాబు సూచనలు
ఉచిత ఇసుక విధానంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని గనుల శాఖను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రవాణా చార్జీల విషయంలో నెలకొన్న గందరగోళం, రీచ్ల వద్ద వాహనాల బారులు తీరడం, లైన్లో ఉన్నా తమకు ఇసుక ఇవ్వలేదంటూ వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయో నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ఎంకే మీనాను ఆదేశించారు.

అధికారుల నివేదిక
మంత్రి కొల్లు రవీంద్ర, ఆ రెండు విభాగాల ముఖ్యకార్యదర్శి మీనాతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిసింది. మీనా ఇటీవల తూర్పుగోదావరి జిల్లా పెండ్యాల, కోనసీమ జిల్లా రావులపాలెం ఇసుక రీచ్లను పరిశీలించారు. ఆ సందర్భంగా అక్కడున్న వినియోగదారులు, ట్రక్కుల యజమానులతో మాట్లాడారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు.. రీచ్లను పరిశీలించి ఏ సమస్యలు కనిపెట్టారని ఆరాతీసినట్లు తెలిసింది. ఆన్లైన్ పర్మిట్లు ఉన్నవారు, లేనివారు స్టాక్పాయింట్ల వద్దకు రావడంతో పోటీ విపరీతంగా పెరిగిపోయిందని, వాహనాల క్యూ ఊహించని రీతిలో ఉంటోందని మీనా నివేదించారు.
సీఎం తాజా ఆదేశాలు
కాగా, అధికారులు వీలైనంత మేరకు ఇసుక స్టాక్పాయింట్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుని, చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉచిత ఇసుకను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎక్కడా ఫిర్యాదులకు అవకాశం లేకుండా అందుబాటులో ఉంచాలని నిర్దేశించారు. స్టాక్ పాయింట్ వద్దకు వచ్చే వారి విషయం నుంచి రవాణా వరకు ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా అవసరమైన కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసారు.












Click it and Unblock the Notifications