వాలంటీర్ల సేవల కొనసాగింపు పై బిగ్ అప్డేట్..!!
ఏపీలో వాలంటీర్ల సేవల కొనసాగింపు పై ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వారి సేవలను ఇంకొంచెం మెరుగ్గా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు తయారు చేయాలని సిఎం చంద్రబాబునాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశం లో కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వాలంటీర్లకు శిక్షణ
వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారిలో కెపాసిటీ బిల్డప్ చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. వాలంటీర్ల విద్యార్హతలు, వయస్సులను సేకరిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల్లో రాజీనామ చేసిన వాలంటీర్లు 1.09లక్షలకుపైగా ఉండగా, విధుల్లో ఉండే వాలంటీర్లు 1.53లక్షల మంది వరకు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వాలంటీర్లకు పెంచిన గౌరవ వేతనం అమలు చేయాలంటే సుమారుగా రూ.1,848కోట్లు ఏడాదికి ఖర్చవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారు.

ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో పిజి చేసిన వారు 5 శాతం, డిగ్రీ చేసిన వారు 32శాతం, డిప్లమో చేసిన వాళ్లు 2శాతం, ఇంటర్ పూర్తి చేసిన వారు 48శాతం, పదవతరగతి పాసైన వారు 13శాతం ఉన్నట్లు గుర్తించారు. వాంటీర్లను వయస్సుల వారీగా లెక్కలు తీయడంతో పాటు ఇతర ప్రాంతాలు, గ్రామాలకు వెళ్లే వారు ఎంతమంది ఉండొచ్చనే అంశంపై కూడా వాలంటీర్ల అభిప్రాయాలను అధికార యంత్రాంగం సేకరించనున్నట్లు సమాచారం. పరిమిత సంఖ్యలోనే వలంటీర్లను వాడుకోవాలని... వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలని కోరుకుంటోంది ప్రభుత్వం.
మంత్రివర్గంలో నిర్ణయం
గత ప్రభుత్వంలో నియమితులైన గ్రామ, వార్డు వలంటీర్లు.. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సంక్షేమ సారథులుగా కొనసాగించారు. అయిదు వేల రూపాయల గౌరవ వేతనంతో పనిచేసిన వలంటీర్లు ఎక్కువగా పింఛన్ల పంపిణీకే పరిమితమయ్యారు. పైగా గత ప్రభుత్వంలో వలంటీర్ల పనితీరుపై అనేక విమర్శలు వినిపించాయి. గత రెండు నెలలుగా వీరికి వేతనాలు ఇవ్వకపోయినా, క్రమం తప్పకుండా... సచివాలయాలకు వెళుతూ హాజరు వేయించుకుంటున్నారు. దీంతో, వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం కోసం వాలంటీర్లు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications