జైల్లో పెడ్తా, రౌడీయిజం చేస్తారా: బాబు, జడ్జిల పైనా.. చిక్కుల్లో జగన్!!
హైదరాబాద్: ప్రతిపక్ష నేత జగన్ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణల పైన సాక్ష్యాలు చూపించాలని, లేదంటే సారీ చెప్పాలని సీఎం చంద్రబాబు సోమవారం శాసన సభలో చెప్పారు. ఆధారాలు చూపిస్తే బాధ్యులను జైల్లో పెడతానన్నారు. సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు.
చంద్రబాబు మాట్లాడుతూ... బిజెపి సభ్యుడు సత్యనారాయణ మాట్లాడుతూ ఇదేదో ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటంగా ఉందని చెప్పారని, అయితే తన పైన చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ నిరూపించాల్సిందే అన్నారు. పద్ధతి లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.
ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే చూపించమనండన్నారు. ఆరోపణలు చూపించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు, గోదావరి ప్రాజెక్టు, జెన్కో తదితరాల పైన ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నిరూపించాలన్నారు.
వ్యక్తిగత అంశాలను సభలోకి తీసుకు వచ్చి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.ఇసుక మాఫియా వల్ల రూ.2వేల కోట్లు ముట్టాయని చెబుతున్నారన్నారు. సోలార్ ఎనర్జీ టెండర్లు ఇంకా పిలువనే లేదు ఆరోపణలు చేశారన్నారు. రాజధాని భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అని ఆరోపిస్తున్నారని ధ్వజమెత్తారు.
జైల్లో పెడతా
రైతులు బాగుపడటం ప్రతిపక్షానికి ఇష్టం లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారన్నారు. ఎవరైనా వచ్చి తమ ప్రభుత్వానికి లంచంగా ఒక్క రూపాయి ఇచ్చినట్లు చెప్పినా.. అది తీసుకున్న వారిని జైలులో పెడతానని చంద్రబాబు చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని చెప్పారు.
వైసిపి వాళ్లు కావాలనే బురద జల్లుతున్నారన్నారు. రాజధానిలో అవినీతి జరగకపోయినా అవినీతి జరిగిందంటున్నారని ధ్వజమెత్తారు. వైసిపి తమ పేపర్ను అడ్డుపెట్టుకొని బురద జల్లుతున్నారన్నారు. తనపై గతంలో చాలాసార్లు కోర్టుకు వెళ్లారని, కానీ నిరూపించలేకపోయారన్నారు.
నా విషయంలో కోర్టులలోను ఆధారాలు చూపించలేకపోయారని, జగన్ విషయంలో ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ సందర్భంగా పలు సందర్భాలలో కోర్టులు తన కేసు విషయంలో, జగన్ కేసు విషయంలో పేర్కొన్న వ్యాఖ్యలను చంద్రబాబు ప్రస్తావించారు.

గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలకు ఇవ్వవలసిన రూ.2వేల కోట్ల సబ్సిడీలు ఇచ్చామన్నారు. జగన్ ఓ పార్టీ అధ్యక్షుడిగా లేకుంటే, ఆయన ఎమ్మెల్యే గెలవకుంటే.. ఆయనకు సమాధానం చెప్పే పరిస్థితి ఉండకుండేదన్నారు. ఇది మన ప్రజాస్వామ్యం గొప్పతనం అన్నారు.
తాను బురదలో కూరుకుపోయి తమ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ పైన చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. అలా కూడా కాదంటే ఆయన పైన తప్పకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయని, కానీ ఆ విషయాల జోలికి తాను వెళ్లడంలేదన్నారు.
అవిశ్వాసం ఎలా పెట్టాలో కూడా తెలియదు
జగన్కు అవిశ్వాసం పెట్టడం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. అవిశ్వాసం నోటీసు పైన సంతకం కూడా పెట్టకుండా, ఎదురు దాడి చేయడం విడ్డూరమన్నారు. రౌడీయిజంతో, బ్లాక్ మెయిల్తో ఈ సభ పని చేయదన్నారు. ఆరోపణలు చేసిన వారు కచ్చితంగా నిరూపించాల్సిందే అన్నారు. కనీసం ప్రాథమిక సాక్ష్యాలు చూపించాలన్నారు. అప్పటి దాకా మాట్లాడే హక్కు జగన్కు లేదన్నారు.
జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు మాటల్లో విచారణ అవసరం లేదని తేల్చి చెప్పారన్నారు. సభలో సిబిఐ విచారణ కోరకూడదా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేయవద్దు, సీబీఐ విచారణ కోరవద్దా అని ప్రశ్నించారు.
జగన్కు మాట్లాడే అవకాశమే లేదు
చంద్రబాబు మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే సిబిఐ విచారణ కోరవచ్చునని చెప్పారు. లేదంటే జగన్కు మాట్లాడే హక్కు లేదన్నారు. జగన్ నోటీసులో సంతకం పెట్టకపోయినా మాట్లాడేందుకు అవకాశమిచ్చామని చెప్పారు. చట్టాన్ని, హుందాతనాన్ని పాటించాలన్నారు. నోటీసులో సంతకం లేకున్నా మాట్లాడుతున్నారన్నారు.
అవిశ్వాస తీర్మానం పైన అసలు జగన్ సంతకమే పెట్టలేదని, నిబంధన ప్రకారం అతనికి మాట్లాడే హక్కే లేదన్నారు. ఒకే వ్యక్తికి గంటల పాటు మైక్ మాట్లాడేందుకు ఇస్తే ఏమిటన్నారు. రౌడీయిజం చేస్తే ఎక్కువ సేపు మాట్లాడవచ్చా అని నిలదీశారు. సభా సంప్రదాయాలు కాపాడాలన్నారు. ప్రతిపక్ష నేతకు ఒక్కరికే మైకు ఎలా ఇస్తారన్నారు.
యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. జగన్ అన్నింటికి తెగించి ఉన్నాడన్నారు. జడ్జిల పైన కూడా ఆరోపణలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. సభలో ఉన్న వారి పైన, జడ్జిల పైన అందరి పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎవరు అంటే వారి పైన ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ప్రతి శుక్రవారం వెళ్లి బోనులో నిలబడతాడని, కనీసం కోర్టులను కూడా గౌరవించడన్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత అసలు ప్రపంచంలో ఉన్నాడా అనే ప్రశ్న ఉదయిస్తోందన్నారు. జగన్ కచ్చితంగా క్షమాపణ చెప్పాలని, లేదా ఆరోపణలు నిరూపించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పదన్నారు. జగన్ చేసింది చాలా సీరియస్ ఆరోపణ అన్నారు.
జగన్ మాట్లాడుతూ... చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయగలడని చెప్పానని, దానికి జడ్జిలను అంటూ యనమల చెప్పారన్నారు. ప్రజలు చూస్తున్నారన్నారు.
యనమల మాట్లాడుతూ.. ఏం మాట్లాడారో చూస్తే అర్థమవుతుందన్నారు. సీఎం చంద్రబాబు జడ్జిల తీర్పును చదివారని, జడ్జిమెంట్ తీర్పును చంద్రబాబు చదివారని, అప్పుడు జగన్ వ్యవస్థలను మేనేజ్ చేయగలడని చెప్పారని, అప్పుడు జడ్జిలకు కాకుండా దేనికి వస్తుందని అభిప్రాయపడ్డారు.
విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. జడ్జిల పైన కామెంట్ చేసే ధైర్యం ఎక్కడిదన్నారు. జగన్ విచక్షణ కోల్పోయి మాట్లాడినట్లుగా కనిపిస్తోందన్నారు. ఎంతసేపు సిబిఐ విచారణ అంటూ పాడిందే పాడుతున్నారన్నారు. ఇది సరికాదన్నారు. జడ్జిల పైన కూడా సభలో మాట్లాడటం విడ్డూరమన్నారు. ఇది దురదష్టకరమైన దినం అన్నారు. జగన్ వెంటనే క్షమాపణలు చెప్పకుంటే తీవ్రమైన ఇబ్బందుల్లో పడే అవకాశముందన్నారు.
ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ.. వ్యవస్థలను మేనేజ్ చేయగలడని జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. న్యాయవ్యవస్థ పైన చేసిన వ్యాఖ్యలకు జగన్ పైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ప్రమాదకరమన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ... ఈ సభలో తనకు ఓ బాధ్యత ఉందని చెప్పారు. ఏదైతే స్వతంత్రంగా పని చేసే న్యాయవ్యవస్థ ఉందో దానిపై ఆరోపణలు చేశారన్నారు. తాను న్యాయవ్యవస్థ పైన చేశానని చెప్పడం ఎంత వరకు సమంజసమన్నారు. జగన్కు ఏ వ్యవస్థ పైనా నమ్మకం లేదా అని ప్రశ్నించారు.
జడ్జిలను ఎవరైనా గౌరవిస్తామన్నారు. న్యాయవ్యవస్థను గౌరవించాలన్నారు. ఆ బాధ్యత లేకుండా.. తాను జడ్జిలను అనలేదని, వ్యవస్థను అన్నాను అంటే.. న్యాయవ్యవస్థను అన్నట్లు కాదా అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిపక్ష నేతను నేను ఎప్పుడూ చూడలేదన్నారు.
జగన్ క్షమాపణ చెప్పాలి, లేదా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పటి దాకా చర్చ జరిగే ప్రసక్తి లేదన్నారు. ఓ నిందితుడు కూడా జడ్జిల గురించి, న్యాయవ్యవస్థ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. జగన్కు న్యాయవ్యవస్థ పైన నమ్మకం లేదన్నారు. సిబిఐ, కోర్టుల పైన నమ్మకం లేదన్నారు. నేను అయిదు కోట్ల ప్రజల తరఫున చెబుతున్నానని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications