"పోలవరం ప్రాజెక్ట్ కాంగ్రెస్ ఘనతే"...అని చంద్రబాబు అన్నారా?...ఎందుకలాగా?
అమరావతి: పోలవరం ప్రాజెక్టును తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు చెబుతున్నారని...కానీ దాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం విజయవాడలో వీఆర్ఏల సభలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
అయితే రాష్ట్రంలో ఏ అభివృద్ది కార్యక్రమం అయినా తన ఘనతే అని చెప్పేందుకు ఏమాత్రం వెనుకాడని చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ ను తామే నిర్మిస్తూ ఆ ఘనతలో ప్రధాన భాగాన్ని కాంగ్రెస్ కు ఆపాదించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో చంద్రబాబు ఎందుకలా అన్నారు?...అనే అంశం సర్వత్రా చర్చనీయాంశం కాగా...ఆయన చాలా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ...
పోలవరం ప్రాజెక్ట్...కాంగ్రెస్ ఘనతే
ఎపిలో పోలవరం ప్రాజెక్టు ఘనత కాంగ్రెస్ దేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వీఆర్ఏలతో నిర్వహించిన సభలో సీఎం ఈ విషయంపై మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్ ను జాతీయ ప్రాజెక్టు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని...90 శాతం డబ్బులిస్తామని విభజన చట్టంలో పెట్టింది కూడా ఆ పార్టీయే అని చంద్రబాబు చెప్పారు. 2013లో వచ్చిన ఆర్ అండ్ ఆర్ చట్టం ప్రకారం డబ్బులిస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు.
ఈ ప్రాజెక్ట్ లో...బిజెపి ప్రమేయం...
అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దృష్ట్యా ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపకపోతే తాను ప్రమాణం స్వీకారం చేయనని భీష్మిస్తే ఆ మేరకు మాత్రమే బీజేపీ నిర్ణయం తీసుకుందన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను నీతి ఆయోగ్ చెబితేనే రాష్ట్రానికి అప్పగించారని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ చేసిందేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అసలు ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన రూ.1,943 కోట్లను కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. డీపీఆర్ రెండు కూడా ఇంకా పూర్తిగా అమలు చేయలేదని, ఈ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా కనబడడం లేదన్నారు. 29 సార్లు ఢిల్లీ వెళ్లినా పట్టించుకోలేదని.. అందుకే కేంద్రంపై పోరాడుతున్నామని చెప్పారు.
చంద్రబాబు...ఎందుకలా?
రాష్ట్రంలోపలే కాదు రాష్ట్రం వెలుపలైనా సరే ఏ అబివృద్ది కార్యక్రమంలోనైనా తమ ప్రమేయం వీసమెత్తు ఉన్నాసరే ఆ ఘనతను సగర్వంగా చాటుకునే సిఎం చంద్రబాబు పోలవరం వంటి కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో...అందులోనూ పోలవరం అనుమతుల విషయాలను పక్కనబెడితే నిర్మాణానికి సంబంధించి ఘనతంతా టిడిపి ప్రభుత్వానికే దక్కాల్సి ఉన్నా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి పాత విషయాలను గుర్తు చేసి మరీ ఈ ప్రాజెక్ట్ ఘనతను కాంగ్రెస్ కు కూడా కట్టబెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు ఇలా ఎందుకు చేశారనే విషయంపై అన్ని రాజకీయపార్టీల్లోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
పొత్తు కోసమేనా?..అదే అంటున్నారు
పొత్తు లేకుండా చంద్రబాబు ఎన్నికల్లో పోటీకి ఇష్టపడరని ప్రత్యర్థి పార్టీల్లోని నేతలు చంద్రబాబును ఎద్దేవా చేస్తుంటారు. అది నిజమేనని చంద్రబాబు నేతృత్వంలో జరిగిన ఎన్నికలు రుజువుచేస్తున్నాయి కూడా. 2004లోను టిడిపి-బీజేపీ కలిసే పోటీ చేశాయి. ఆ ఎన్నికలు రెండు పార్టీలకూ కలిసిరాలేదు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో టిడిపి అధికారాన్ని కోల్పోయాయి. ఆ తరువాత ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. బీజేపీతో ఇంకెన్నడూ పొత్తు పెట్టుకోనని టిడిపి మహానాడు వేదిక నుండి చంద్రబాబు ఒక శపథం కూడా చేశారు. కానీ గత ఎన్నికల్లో ఆ శపథం పక్కన పెట్టేశారు.
వైఎస్ఆర్ కు కూడా...దక్కుతుందిగా
అయితే ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తుకు చంద్రబాబు మానసికంగా తాను సిద్దపడి ఉండొచ్చని, పార్టీ శ్రేణుల్ని కూడా ఆ దిశలో సంసిద్దం చేసే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. అయితే పోలవరం ఘనత కాంగ్రెస్ కు ఆపాదిస్తే అది వైఎస్ కు కూడా ఆపాదించినట్లేనని, అది వైసిపికి ప్లస్ కావచ్చనేది కొందరు టిడిపి నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకనే చంద్రబాబు చెప్పిన ఈ విషయాన్ని ఆయనకు అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు రాయలేదంటున్నారు. అయితే చంద్రబాబు అది కూడా ఆలోచించి వైఎస్ఆర్ ను కాంగ్రెస్ నేతగానే తాను గుర్తిస్తున్నట్లు చెప్పకనే చెప్పారనేది మరికొందరి అభిప్రాయం.