పవన్ కళ్యాణ్ 'అనుమానం' ఎఫెక్ట్, వారి వల్లే గందరగోళం: బాబు, కేంద్రంపై యూటర్న్!
అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. పోలవరంను గడువులోగా పూర్తి చేస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని, ఇది సంతోషకరమని చంద్రబాబు అన్నారు.
Recommended Video

అదే సమయంలో మంత్రి నారా లోకేష్ కూడా బీజేపీకి అనుకూలంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఏమీ చేయడం లేదని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. టిడిపి - బీజేపీ మధ్య ఎలాంటి గ్యాప్ పెరగలేదని స్పష్టం చేశారు. తొలుత పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు, టీడీపీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడు మాత్రం బీజేపీకి అనుకూలంగానే మాట్లాడుతున్నారు.

అధికారుల లేఖ వల్లే గందరగోళం
సీఎం చంద్రబాబు శుక్రవారం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలకు దిశా నిర్దేశనం చేశారు. కేంద్ర అధికారులు రాసిన లేఖ వల్లే కొంత గందరగోళం ఏర్పడిందని చెప్పారు. పోలవరంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెంటనే స్పందించి, సమావేశం ఏర్పాటు చేశారన్నారు.

దేవినేని ఉమకు ఆదేశాలు
పోలవరం ప్రాజెక్టుపై వివరాలను మంత్రులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని చంద్రబాబు మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు ఆదేశించారు. మనం ప్రజలకే జవాబుదారులమని స్పష్టం చేశారు. పోలవరంపై కాంగ్రెస్, వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు.

అదే శ్వేతపత్రంతో సమానం
పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శకంగా ఉన్నామని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో పోలవరంపే ప్రకటన చేశామని, అదే శ్వేతపత్రంతో సమానమని చెప్పారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలని పవన్ కళ్యాణ్, వైసీపీ డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు పైవిధంగా స్పందించారు.

మేం ఏం చేస్తున్నామో చెబుతున్నాం
కేంద్రం నుంచి వచ్చే అభ్యంతరాలను ఎప్పటికి అప్పుడు పరిష్కరించుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో పాటు పోలవరంపై రాష్ట్రం పెడుతున్న ఖర్చును కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని చెప్పారు. పోలవరంపై ఖర్చుల గురించి పవన్, జగన్ నిలదీయడం, వారు గురువారం ప్రాజెక్టును సందర్శించిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు.

రైతులు విరాళాలు ఇచ్చి కూలీ చేస్తామంటున్నారు, థ్యాంక్స్
రాజకీయ ప్రయోజనాల కోసమే పోలవరంపై ప్రతిపక్షం అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు అన్నారు. పోలవరం పూర్తయితే వైసీపీ మనుగడే ప్రశ్నార్థకం అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం పూర్తి చేస్తామన్నారు. పోలవరం కోసం విరాళాలు ఇస్తామని, తాము కూడా వచ్చి కూలీ పని చేస్తామని రైతులు సందేశాలు పంపుతున్నారని చంద్రబాబు అన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications