ఏం చేద్దాం?:ఐటి దాడులపై మంత్రివర్గ సహచరులతో సిఎం చంద్రబాబు సమాలోచనలు...సంచలన నిర్ణయాలు..!
Recommended Video

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకకాలంలో పెద్ద ఎత్తున ఐటి దాడులు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యేనని ఎపి ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కేంద్రమే ఇలాంటి చర్యలకు ఒడిగట్టడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో మంత్రి వర్గ సహచరులతో అత్యవసరంగా సమావేశమైన సిఎం చంద్రబాబు కేంద్ర చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి స్పందనకు సంబంధించి పలు నిర్ణయాల ప్రతిపాదనలను మంత్రి వర్గ సహచరులు ముందు ఉంచగా, అందుకు ప్రతిగా వారు కూడా కొన్ని సూచనలు చేసినట్లు తెలిసింది. వీటిలో ఐటి బృందాలకు పోలీసు రక్షణను ఉపసంహరించుకోవడం,సుప్రీం కోర్టును ఆశ్రయించడం వంటి సంచలన నిర్ణయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఎపిపై కక్షసాధింపు చర్యలకు దిగింది!...అందుకు నిదర్శనమే ఈ ఐటి దాడులు అంటూ సిఎం చంద్రబాబుతో సహా విమర్శల వర్షం కురిపిస్తున్న అధికార పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు ప్రతిగా ఎలా స్పందిస్తుందనే విషయమై ఉత్కంఠతో నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఐటి దాడులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిఎం చంద్రబాబు తదుపరి కార్యాచరణ ప్రణాళికపై అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారని తెలిసింది.
ఈ సమావేశంలో తొలుత ఇది ఆంధ్రప్రదేశ్ పై కేంద్రప్రభుత్వం కక్ష సాధింపు చర్యేనని అందరూ అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో ఈ దాడులపై ఎలా స్పందించాలనే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఐటి దాడులకు సహాయ నిరాకరణ చేస్తే ఎలా ఉంటుందని ప్రతిపాదించారట. అంటే...
ప్రధానంగా ఐటి బృందాలకు పోలీసు రక్షణ విరమించుకోవడం చేస్తే ఎలా ఉంటుంది...దానివల్ల న్యాయపరంగా ఏమైనా చిక్కు వచ్చే అవకాశం ఉంటుందా?...అనే ప్రతిపాదన పెట్టగా అందరూ ముక్తకంఠంతో ఆ సూచన బాగుందని, న్యాయపరమైన చిక్కులు లేకుంటే అదే చేద్దామని బలపరిచారట.
అయితే ఆ క్రమంలో ఐటి అధికారులపై ఏమైనా దాడి జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం చర్చకు వచ్చిందని తెలిసింది. అలాగే రాష్ట్రంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందనే విషయం చర్చకు రాగా ఆ ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం వ్యక్తం అయిందట. ప్రస్తుతానికి ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి న్యాయనిపుణలతో చర్చించి వారి సలహా మేరకు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సిఎం చంద్రబాబు యోచిస్తున్నారట. అలాగే నిర్ణయం కేవలం తనపైనే వదిలేయడం కాకుండా కేంద్రాన్ని నిలువరించే విషయమై ఎవరైనా సూచనలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వొచ్చని...ఈ విషయమై అందరూ దృష్టి సారించాలనే హెచ్చరించారట.












Click it and Unblock the Notifications