దుబాయ్, అబుదాబి, యూఏఈలలో సీఎం చంద్రబాబు పర్యటన.. కారణం అదే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు సిద్దమయ్యారు. కాగా ఈ మేరకు షెడ్యూల్ వివరాలు అధికారికంగా విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి 24 వరకు సీఎం విదేశాల్లో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సీఎం చంద్రబాబు దుబాయ్, అబుదాబి, యూఏఈలో పర్యటన ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు అధికారులు వెళ్లనున్నట్లు సమాచారం. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరిగే సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టినట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

కాగా స్థిరాస్తి, భవన నిర్మాణం, లాజిస్టిక్స్, రవాణా, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్నోవేషన్స్ సహా పలు రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించనున్నారని అధికారులు చెబుతున్నారు. రాజధాని అమరావతి సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల అభివృద్ధికి ఈ పర్యటన కీలకంగా భావిస్తున్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఇప్పటికే సింగపూర్, దావోస్ లలో చంద్రబాబు పర్యటించారు. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపాటు పలువురు ఉన్నతాధికారులు ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ ప్రభుత్వాధికారులు, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు రాజధాని అమరావతిలో కూటమి ప్రభుత్వం ఒక కీలక కార్యక్రమానికి సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో.. ఒకే రోజు, ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు ప్రత్యేక ప్రధాన కార్యాలయాలు లేవు. ప్రస్తుతానికి ఇవి విజయవాడలోని ప్రాంతీయ కార్యాలయాల ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి.. ఉద్దండరాయునిపాలెం సమీపంలోని ఎన్10 రోడ్ వద్ద గత ప్రభుత్వాన్ని కింద వివిధ బ్యాంకులకు స్థలాలను కేటాయించింది.
వాటిలో..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు 3 ఎకరాలు
ఆప్కాబ్ కు 2 ఎకరాలు
కెనరా బ్యాంక్, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ వంటి ఇతర బ్యాంకులకు ఒక్కో బ్యాంకుకు 25 సెంట్ల (పావు ఎకరం) స్థలాలు కేటాయించబడ్డాయి.












Click it and Unblock the Notifications