ఏపీకి బిగ్ అలర్ట్, 4 రోజులు దంచుడే- చంద్రబాబు ఆదేశాలు..!!
ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తాజా అంచనాలు వెల్లడించింది. దీంతో, ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాల పై సమీక్ష చేసారు. మంత్రులు, అధికారులను అప్రమత్తం చేసారు. ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలు
భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించంటంతో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. అతి భారీ వర్షాలు ఉండే ప్రాంతంలో ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల మొబైల్ ఫోన్లకు భారీ వర్షాలపై మెసేజ్ లు పంపి అలెర్ట్ చేయాలని, చెరువు కట్టల, కాలువ కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వం అప్రమత్తం
వాగులు, కాలువల వద్ద అవసరమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రెయిన్ ఫాల్ వివరాలను కూడా రియల్ టైంలో అందుబాటులో ఉండాలని సూచించారు. అప్రమత్తతతో ప్రాణ, ఆస్థినష్టం లేకుండా చేయాలన్నారు. కంట్రోల్ రూంల ఏర్పాటుతో ప్రజల వినతులపై వేగంగా స్పందించా లని సూచించారు సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
నాలుగు రోజులు వర్షాలు
ప్రస్తుతం నెల్లూరులో 30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు సీఎంకు వివరించారు. మంగళవారం నుంచి వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. నెల్లూరు, తిరుపతి జిల్లాలో అవసరమైన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ సిద్దంగా పెట్టినట్లు అధికారులు వివరించారు.. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, ఆయా ప్రాంతాల్లో అధికారులు, ప్రభుత్వ విభాగాల సన్నద్దతపై సీఎం సమీక్షించారు.












Click it and Unblock the Notifications