బిజీబిజీగా చంద్రబాబు:నేడు సింగపూర్ లో...రేపు విశాఖ,అమరావతి
అమరావతి:ముఖ్యమంత్రి చంద్రబాబు టైమ్ షెడ్యూల్ బిజీబిజీ నడుస్తోంది. నేడు సింగపూర్ లో పర్యటిస్తున్న చంద్రబాబు అక్కడ హిందూస్థాన్ టైమ్స్-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్-2018లో పాల్గొంటున్నారు. అనంతరం తన ఒక్కరోజు పర్యటన ముగించుకొని రాత్రికి తిరుగు ప్రయాణమై శనివారం ఉదయానికే ఆయన విశాఖ పట్టణం చేరుకుంటారని తెలిసింది.
అక్కడ కొన్ని అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మళ్లీ సాయంత్రానికే తిరిగి అమరావతి చేరుకుంటారని సమాచారం. అమరావతిలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన పలు ఆసక్తికర పరిణామాలు ఎదురైనట్లు ఆయనతో పాటు ఈ పర్యటనలో పాల్గొంటున్న మంత్రివర్గ సహచరులు, ఇతర ప్రతినిధుల బృందం పంపిన సమాచారం బట్టి తెలుస్తోంది.
శుక్రవారం...సింగపూర్ లో
ప్రస్తుతం సింగపూర్ లో జరుగుతున్న హిందూస్థాన్ టైమ్స్-మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్-2018లో పాల్గొంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సులో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార, వాణిజ్య పారిశ్రామిక సంస్థల సీఈవోలతో చంద్రబాబు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు ఈ పర్యటనలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు.
ఆసక్తికర ప్రశ్న...అడిగిన టోనీ బ్లెయిర్
సిఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో బ్రిటన్ మాజీ ప్రధాని,"టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్" నిర్వాహకుడు టోనీ బ్లెయిర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ఒకప్పటి హైదరాబాద్ టూర్, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో కలిసి మహబూబ్నగర్ జిల్లాలోని ఓ గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారట. అలాగే కొత్త రాష్ట్రం ఎలా ఉందని చంద్రబాబును అడిగి వివరాలు తెలుసుకున్నారట. చంద్రబాబు నాయకత్వంలో నూతన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న తీరు గురించి తనకు తెలుసునని టోనీ బ్లెయిర్ ఈ సందర్భంగా చెప్పారట.
రైతుల గురించి...వివరించిన చంద్రబాబు
కొత్త రాజధాని నిర్మాణానికి రైతులు ఏ విధంగా ముందుకొచ్చి తమకు భూ సమీకరణ విధానంలో భూములు ఎలా అందించారో టోనీ బ్లెయిర్కు చంద్రబాబు వివరించారట. ఎపికి పెట్టుబడుల ఆకర్షణకు తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రానున్న 15, 20 ఏళ్లలో 15 శాతం సుస్థిర వృద్ది లక్ష్యాన్నిపెట్టుకుని పనిచేస్తున్న వైనం గురించి ఈ సందర్భంగా చంద్రబాబు టోనీ బ్లెయిర్ కు వివరించారు. అలాగే ఫైబర్ కనెక్టివిటీ,ఆహారశుద్ధి రంగంలో ఏపీలో ఉన్నఅపార అవకాశాల గురించి టోనికి వివరించారట. ఎప్పుడైనా భారతదేశ పర్యటనకు వెళితే ఏపీని తప్పకుండా సందర్శించాలని ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తనతో చెప్పిన విషయాన్ని చంద్రబాబుకు తెలియచెప్పారట.
టోనీ బ్లెయిర్ కు...ఆహ్వానం
1978 నుంచి 40 ఏళ్ల పాటు చంద్రబాబు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడం ఎలా సాధ్యమైందని టోనీ బ్లెయిర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారట. నూతన రాష్ట్రాభివృద్ధికి ఎటువంటి విజన్తో ముందుకెళ్తున్నారని చంద్రబాబును అడుగగా తమ ప్రభుత్వం అమలు చేస్తున్న రియల్టైమ్ గవర్నెన్స్, కాంప్రహెన్సీవ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్, విద్యుత్ సంస్కరణలు, సౌర, పవన విద్యుత్ విధానాలు, నూరుశాతం ఓడీఎఫ్, ఐవోటీ, డ్రోన్లు, అప్లికేషన్లతో వ్యవసాయ రంగానికి సాంకేతికత జోడింపు వంటి ప్రభుత్వం తీసుకున్న చర్యలను చంద్రబాబు వివరించారని తెలిసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను సందర్శించాలని టోనీ బ్లెయిర్ ను చంద్రబాబు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారని సమాచారం.