పరువు తీశారు: కలెక్టర్ సహా బాబు ఆగ్రహం, ఎప్పుడేం జరిగింది?
రాజమండ్రి: పుష్కర ఘాట్ ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తూర్పు గోదావరి జిల్లా అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పుష్కర ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన 11 రోజులూ స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలనుకున్న పుష్కరాల్లో అపశ్రుతి దొర్లడంతో జిల్లా యంత్రాంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత మంది భక్తుల మృతికి కారణమైన అధికారుల తీరును ఎండగట్టారు.
భారీగా యాత్రికులు వస్తారని తెలిసినా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో విఫలమవడంపై కలెక్టర్తో సహా అన్ని విభాగాల అధికారులను నిలదీశారు. ఇన్నాళ్లు చేసిన ఏర్పాట్లు ఇవేనా అని మండిపడ్డారు.
గత పుష్కరాలతో పాటు ఇటీవల వచ్చిన హుధుద్ తుపాను పునరావాస చర్యల ద్వారా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రభుత్వానికి పుష్కరాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చర్యలతో పరువు పోయిందన్నారు.
రద్దీ నియంత్రణ, వసతుల విషయంలో సరైన చర్యలు చేపట్టలేదన్నారు. అన్ని ఘాట్ల మాదిరిగా ఘాట్ ఇంఛార్జిని నియమించిన అధికారులు ముఖ్యమంత్రి కార్యక్రమాల నిర్వహణ, తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోకపోవడంపై మండిపడ్డారని తెలుస్తోంది.
తన జీవితంలో ఇలాంటి సంఘటన చూడలేదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పుష్కరాల్లో మిగిలిన 11 రోజులు ఎలాంటి అపశ్రుతి దొర్లకుండా చర్యలు చేపట్టేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగారు. పుష్కరాలు ముగిసే వరకు రాజమండ్రిలోనే ఉండి రోజువారీ యాత్రికుల భద్రత, వసతులపై దృష్టి సారించనున్నారు.
తిరుమల తరహాలో యాత్రికుల రద్దీని నిలువరించేందుకు హాల్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రహదారుల నిండా క్యూలైన్లు ఏర్పాటు చేసిన అధికారులు వాటి నిర్వహణలో విఫలమయ్యారు.
విషాదం జరిగిన క్రమం..
ఉదయం 3 గంటలకు.. పుష్కరాల రేవు వద్దకు భారీగా భక్తులు వచ్చారు. అప్పటికే వేలమంది స్నానాల కోసం చూస్తున్నారు. భక్తులు క్యూ లైన్లలో భారులు తీరారు.
ఉదయం 5 గంటలకు అనుమతించిన ప్రాంతాల్లో భక్తులు స్నానాలు చేయడం ప్రారంభించారు.
ఉదయం 6 గంటల ప్రాంతంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వచ్చారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చారు.
ఉదయం 6.10 గంటలకు ప్రత్యేక పూజలు. ఆరున్నరకు సీఎం స్నానం చేశారు.
ఉదయం ఏడు గంటల సమయంలో మరింత రద్దీ పెరిగింది. రేవులో ఉన్న వారిని బయటకు, బయటివారు లోపలకు రాకుండా ఆపేశారు. పెద్దలకు పిండ ప్రధాన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఏడున్నర గంటల ప్రాంతంలో చంద్రబాబు కార్యక్రమాలు ముగించుకొని వెళ్లారు. ఆయన వెళ్లగానే స్నానాల కోసం పెద్ద ఎత్తున బయట ఉన్నవారు లోపలకు రావడం, లోపలున్న వారు బయటకు వచ్చారు.
దాదాపు అరగంట పాటు మాత్రం లోపలున్న వారిని బయటకు, బయటున్న వారిని లోపలకు అనుమతించలేదు.
ఉదయం 8.00 గంటలకు చిన్నగా మొదలైన తోపులాట, ఎనిమిదిన్నరకు ఎక్కువ అయింది. అప్పటి నుండి ఓ ఇరవై నిమిషాల పాటు తొక్కిసలాట జరిగింది.
అయితే, భక్తులు, వీఐపీలు ఒకే ఘాట్ వద్దకు ఎక్కువ మంది రావడంతో ఇది జరిగింది. మిగతా ఘాట్ల వద్ద ఆ సమయానికి రద్దీ ఎక్కువగా లేదు.