జగన్! తీసుకోవాలా వద్దా?: బాబు ప్రశ్న, స్వయంగా యుద్ధం!!
ఏలూరు: కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.30 వేల కోట్లను ఇస్తామని చెప్పిందని, విభజన తర్వాత ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో ఈ నిధులు తీసుకోవాలా? వద్దా? అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష వైసిపి, కాంగ్రెస్ పార్టీలను ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు కడితే రాష్ట్రంలో అన్నిప్రాంతాలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు. ప్రతి సోమవారం సాంకేతికత ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తానని చెప్పారు. అందుకే ప్రాజెక్టు పూర్తయ్యే వరకూ ప్రతి సోమవారంను పోలవారంగా పిలుస్తామన్నారు.
ప్రత్యేక హోదాకు సమానమైన ప్రయోజనం, రాజధాని నిర్మాణానికి నిధులు, ఆర్థికలోటు భర్తీ ప్రక్రియ చేపడతామని కేంద్రం ప్రకటించిందని, ఏపీ ప్రయోజనాల కోసం వీటనన్నింటినీ అంగీకరించానన్నారు. తాను ఎక్కడా తప్పులు చేయలేదని, కోర్టుకు వెళ్లి కొంతమంది అవనసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాజధానిలో కేసు ఉందని, తనపై కేసు పెట్టడానికి అవకాశం లేదన్నారు.
దోమలపై దండయాత్ర
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో శనివారం చంద్రబాబు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన కలిగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని కోటి మంది విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక్కొక్కరు అయిదుగురికి అవగాహన కలిగించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
చంద్రబాబు వినూత్న కార్యక్రమం
దోమల ద్వారానే తొమ్మిది రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని వీటిని అరికట్టడమే 'దోమలపై దండయాత్ర-పరిసరాల పరిశుభ్రత' కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దీనికోసం అంతా కలిసి కదలాలని పిలుపునిచ్చారు.
ప్లకార్డులు చేతబూని
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్న ముఖ్యమంత్రి స్వయంగా దోమల నియంత్రణ, వాటివల్ల వచ్చే వ్యాధులతో కూడిన ప్లకార్డులను చేతబట్టి ముందుకు కదిలారు. జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న సురేష్ చంద్ర బహుగుణ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
వ్యాధులు
చికెన్ గున్యా, మలేరియా, డెంగీ, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమల వల్లే వస్తాయన్నారు. వీటిని నివారించాలంటే ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని కోరారు. ప్రపంచాన్ని ఇంట్లోనే కూర్చుని వీక్షించే స్థాయి వచ్చిన తర్వాత కూడా దోమల వల్ల మనుషులు జ్వరాలతో బాధ పడుతుండటం చాలా ఇబ్బందికర విషయమన్నారు.
బహిరంగ మలమూత్ర విసర్జన వద్దు
బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయన్నారు. దీనిని నివారించడానికి రాష్ట్రంలోని 110 పురపాలక సంఘాలను అక్టోబర్ 2న బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా ప్రకటిస్తామన్నారు. ఏలూరులో డిసెంబర్ నెలాఖరు నాటికి ఈ పని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు.
అమరావతిలో కమాండ్ కంట్రోల్ కేంద్రం
వ్యాధులపై సమాచారం కోసం అమరావతిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వ్యాధి బాధితులు ఉండే పరిసరాలు, నీటి కాలుష్యం తదితర అంశాలను అక్కడి నుంచి పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు.