కేంద్రం తీరుపై చంద్రబాబు అసంతృప్తి... పోరాటం చేయాలని నిర్ణయం
విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు.
అమరావతి: విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టం హామీల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రంపై రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు వాటి అమలుపై కీలక అంశాలను చర్చించారు. మూడేళ్లు గడుస్తున్నా విభజన హామీలు ఇంకా అమలు కాలేదంటూ కేంద్రం తీరుపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టంలోని షెడ్యూలు 9, 10 సవరణలకు సంబంధించి జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ రావాల్సిన వాటాపై కేంద్ర ప్రభుత్వ ప్రకటనలు రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో స్థానికత గడువు జూన్ 1 తేదీతో ముగుస్తుంది. ఈ గడువును మరో రెండేళ్లు పెంచాలని, ఇందుకోసం కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
2017 జూన్ 2 తేదీలోపు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తిస్తామని, కేంద్రం ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం స్థానికత గడువు జూన్ 1 తేదీతో ముగుస్తుంది. విభజన చట్టం సమస్యలపై కేంద్రంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.