కేంద్రంపై ఎదురుదాడి చేయండి, నేనే సీనియర్ అని గుర్తుచేయండి..: చంద్రబాబు
Recommended Video
హైదరాబాద్: మంగళవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
అవిశ్వాసంపై చర్చ సమయంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై పలు సలహాలు సూచనలు చేశారు. అదే సమయంలో బీజేపీపై ఘాటైన విమర్శలు కూడా చేశారు. విభజన హామిల గురించి ప్రశ్నిస్తే.. ఎదురుదాడి చేస్తున్నారని, ఇక మనం కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదని, కేంద్రంపై ఎదురుదాడికి దిగాల్సిందే అని స్పష్టం చేశారు.
తాను 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుడినన్న విషయాన్ని, వాళ్ల కన్నా ముందుగా తానే సీఎం అయ్యానన్న విషయాన్ని గుర్తు చేయాలని ఎంపీలతో చంద్రబాబు పేర్కొనడం గమనార్హం. గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానన్న సంగతి కూడా గుర్తుచేయాలని, చిన్న మచ్చ కూడా లేని తనపై బీజేపీ దాడిని ప్రశ్నించాలని సూచించారు.
వ్యక్తిగత విమర్శలకు దిగితే మనమూ వెనుకాడకూడదని చంద్రబాబు ఎంపీలతో అన్నారు. రాజకీయాల్లో హుందాతనం అవసరమని, అప్పుడే కాంగ్రెస్తో పొత్తులు అంటూ లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలకు దిగితే తాము మోడీ, అమిత్ షా గురించి మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. మునుపెన్నడూ లేనివిధంగా బీజేపీలో ఇప్పుడో కొత్త కల్చర్ మొదలైందని విమర్శించారు.