జాతికి తీరని అన్యాయం!.. ఇలాంటిది నా జీవితంలో ఊహించలేదు: చంద్రబాబు
విజయవాడ: విభజన హామిలపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ తన పుట్టినరోజు నాడు ఒక రోజు నిరహార దీక్షకు దిగిన సీఎం చంద్రబాబు సాయంత్రం దీక్షను విరమించారు. ఇద్దరు చిన్నారులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారని అన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరూ నినదించారని, ఎక్కడికక్కడ గళమెత్తారని అన్నారు. చెన్నై నుంచి కర్నూలు.. కర్నూలు నుంచి హైదరాబాద్.. హైదరాబాద్ నుంచి అమరావతికి రావడం వల్ల ఎక్కడా ఎవరికీ జరగనంత అన్యాయం ఈ జాతికి జరిగిందన్నారు.

నా జీవితంలో ఊహించలేదు
'నా పుట్టినరోజున నిరసన దీక్ష చేయాల్సి వస్తుందని నా జీవితంలో ఎన్నడూ అనుకోలేదు. ఒకవిధంగా ఇందుకు గర్వపడుతున్నా. రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు.. మీరంతా నాపై నమ్మకం పెట్టుకున్నారు. మీకు న్యాయం చేయడం నా బాధ్యత. ఈ బాధ్యతను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదు.' అని సీఎం స్పష్టం చేశారు. నేటి నిరాహార దీక్షలో పాల్గొని తనకు ఆశీర్వచనాలు ఇచ్చిన అన్ని మతాల పెద్దలకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు.

వాళ్ల అజెండా వేరే..
తాను తలపెట్టిన దీక్ష తెలుగుదేశం పార్టీ అధినేతగా కాకుండా, 5కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున దీక్ష చేశాను అని చంద్రబాబు అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం వేరే ఎజెండాతో దీక్షకు రాకుండా దూరంగా ఉన్నాయని అన్నారు.
రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలు.. వాటి అజెండాను ఎన్నికలకు పరిమితం చేసి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం వెంట నడవాల్సి ఉందని పేర్కొన్నారు.
లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి చిన్న తరహా పరిశ్రమల దాకా అందరూ దీక్షకు తరలివచ్చారని అన్నారు. ఎన్జీవో సంఘాలు, రెవెన్యూ సంఘాలు, కుల సంఘాలు, అన్ని మతాల పెద్దలు దీక్షకు వచ్చి సంఘీభావం తెలిపారని చెప్పారు.

సమన్యాయం చేయమన్నాను..
విభజన సమయంలో ఇరువురికి సమన్యాయం చేసి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇరువురికి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కార మార్గం చూపించండి అని ఢిల్లీలో సైతం పోరాడానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. జాతీయ మీడియాకు తన విజ్ఞప్తి ఒకటేనని.. న్యాయం కోసం పోరాడుతున్నామని. కేంద్రంతో పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తమ బాధల్ని జాతీయ స్థాయిలో తెలియజేస్తున్నందుకు వారి ధన్యవాదాలు తెలిపారు.

చేయరా అని ప్రశ్నిస్తున్నా..:
రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతోనే తాను ఎన్డీయేతో కలిశాను తప్ప ఇంకొకటి కాదని చంద్రబాబు అన్నారు. ఇకనైనా విభజన చట్టంలో పొందుపరిచిన హామిలను నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తున్నాని.. చేయరా అని అడుగుతున్నానని.. చేయకపోతే ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు అన్నారు. నాలుగేళ్ల దాకా మీరు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని కొంతమంది తనను అడుగుతున్నారని, కానీ ప్రజలే తనకు హైకమాండ్ అని, ఎవరికీ భయపడేది లేదని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం పూర్తి చేసి తీరుతామన్నారు.












Click it and Unblock the Notifications