సంస్కరణల సారథికి సమున్నత గౌరవం, 'బిజినెస్ రిఫార్మర్' గా చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనా దక్షతకు మరో మకుటం దక్కింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థ ఎకనమిక్ టైమ్స్ ప్రకటించిన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. రేపు (శనివారం) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరిగే భారీ కార్యక్రమంలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
కేవలం 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాదు, అంతకు మించి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్' అనే కొత్త నినాదాలతో చంద్రబాబు పాలనలో దూసుకుపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే దాదాపు రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చేందుకు ఆయన చేస్తున్న కృషిని ఎకనమిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

దిగ్గజాల సమక్షంలో పురస్కారం
రేపు సాయంత్రం 5:30 గంటల నుంచి 7:30 గంటల వరకు జరిగే ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా దేశంలోని దిగ్గజ పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, నితీష్ కుమార్, అశ్వినీ వైష్ణవ్, ఎస్. జైశంకర్ వంటి ప్రముఖులు అందుకున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చంద్రబాబు చేరడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.
ముంబై పర్యటన షెడ్యూల్ (ఏప్రిల్ 25):
- మధ్యాహ్నం 12:50: అమరావతి క్యాంప్ కార్యాలయం నుంచి నిష్క్రమణ.
- మధ్యాహ్నం 2:40: ముంబై విమానాశ్రయానికి చేరుకుంటారు.
- సాయంత్రం 5:25: జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు.
- రాత్రి 9:30 వరకు: ఎకనమిక్ టైమ్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు.
- రాత్రి 9:50: ముంబై నుంచి తిరుగు ప్రయాణం.
బ్రాండ్ బాబు.. పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్!
ఒకప్పుడు హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చి ప్రపంచ పటంలో నిలిపిన చంద్రబాబు, ఇప్పుడు అమరావతిని ఆర్థిక కేంద్రంగా, విశాఖను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దుతున్నారు. పారిశ్రామిక అనుమతుల ప్రక్రియను సరళతరం చేస్తూ ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ అవార్డు ఆయన బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచడమే కాకుండా, ఏపీకి మరిన్ని పెట్టుబడులు రావడానికి దోహదపడనుంది.












Click it and Unblock the Notifications