మూడు రీజియన్లుగా రాష్ట్ర విభజన.. 20 లక్షల ఉద్యోగాలు!
ఒకప్పుడు దావోస్లో భారతీయులే అరుదుగా కనిపించేవారని, ఇప్పుడు మాత్రం 20 దేశాల నుంచి వచ్చిన తెలుగు వారితో ఇది విజయవాడ, తిరుపతి లాంటి వాతావరణాన్ని తలపిస్తోందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రాబాబు. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిపై స్పష్టమైన దిశను చూపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఇది తెలుగు సమాజం ప్రపంచవ్యాప్తంగా సాధించిన ఎదుగుదలకు నిదర్శనమన్నారు.
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని చంద్రబాబు వెల్లడించారు. ఆర్సెలార్ మిట్టల్ సంస్థ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు తాను శంకుస్థాపన చేశానని, ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముందుకొస్తోందని చెప్పారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమలు, అలాగే తక్కువ ధరలకు విద్యుత్ కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణల వల్లే డేటా సెంటర్లు పెద్ద సంఖ్యలో రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు.

20 లక్షల ఉద్యోగాలు
ప్రస్తుతం వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో మొత్తం రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చలు జరుగుతున్నాయని, ఇవి కార్యరూపం దాలిస్తే దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా విభజించి సమతుల్య అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారి గ్రామాల్లో ఉన్న కుటుంబాల అభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
డ్రోన్ ఆపరేషన్లు..
ప్రపంచంలో అతి చిన్న దేశమైన లైచెన్ స్టెయిన్ అత్యంత సంపన్న దేశంగా ఎదగడానికి కారణం టెక్నాలజీని అందిపుచ్చుకోవడమేనని చంద్రబాబు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో క్వాంటం, ఏఐ, స్పేస్, డ్రోన్ టెక్నాలజీలను విస్తృతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా ప్రజలకు, వ్యవసాయం, వైద్య రంగాలకు సేవలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, డ్రోన్ ఆపరేషన్లకు అనుమతుల బాధ్యతను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి
రాష్ట్రం ఎలక్ట్రానిక్స్, హెల్త్ డివైసెస్, ఫార్మా రంగాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని చంద్రబాబు చెప్పారు. 'సంజీవని' ప్రాజెక్టు ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచే చర్యలు చేపడుతున్నామని, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. నీటి భద్రతకూ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రస్తుతం ఏపీ రిజర్వాయర్లలో 958 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తెలిపారు.
ఏఐకి ప్రపంచంలో చిరునామాగా భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాళ్లే నిలుస్తున్నారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు తమ జ్ఞానం, నైపుణ్యాలతో రాష్ట్రాభివృద్ధికి భాగస్వాములవ్వాలని, ఆంధ్రప్రదేశ్ను టెక్నాలజీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications