ఆధార్, ఓటర్ ఐడీ ఉన్నా భారతీయులు కారా? కలకత్తా హైకోర్టు బాంబు
మన దేశంలో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్బుక్ వంటివి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిని భారతదేశ పౌరుడిగా పరిగణించలేమని కలకత్తా హైకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పత్రాలన్నీ కేవలం గుర్తింపు పొందేందుకు లేదా నిర్దిష్ట సేవల కోసం మాత్రమే ఉపయోగపడతాయని, ఇవి పౌరసత్వానికి ప్రామాణిక రుజువులు కావని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ వ్యక్తి తనను భారత పౌరుడిగా నిరూపించుకోవడంలో విఫలమైన కేసును విచారిస్తూ న్యాయస్థానం ఈ విసరణలు ఇచ్చింది.
వివాదం వెనుక ఉన్న అసలు కథ
ముర్షిదాబాద్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుడని ఆరోపిస్తూ పోలీసులు అతడిని డిటెన్షన్ సెంటర్ తరలించారు. ఈ చర్యను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. తాను పుట్టుకతోనే భారత పౌరుడనని నిరూపించుకునేందుకు సదరు వ్యక్తికి, అతడి తరఫున హాజరైన బంధువుకు కోర్టు అనేక అవకాశాలు ఇచ్చినప్పటికీ, వారు సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయారు. దీంతో చట్టప్రకారం తాను భారత పౌరుడనని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆ వ్యక్తిపైనే ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

పరస్పర విరుద్ధ ప్రకటనలు.. అనుమానాస్పద వివరాలు
ఈ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ ఇచ్చిన వివరాలలో అనేక తప్పులు బయటపడ్డాయి. విచారణ ప్రారంభంలో సదరు బంధువు తాను నిందితుడికి వరుసకు కజిన్ అని చెప్పగా, ఆ తర్వాత కోర్టు ముందు సొంత బాబాయ్నని పేర్కొన్నాడు. అంతేకాకుండా 1980లో నిందితుడి తండ్రి చనిపోయాడని, అప్పటి నుంచి తానే అతడిని పెంచి పెద్ద చేశానని చెప్పాడు. కానీ అధికారిక రికార్డులను పరిశీలించగా.. బంధువు కంటే నిందితుడే వయసులో పెద్దగా ఉన్నట్లు తేలింది. దీనితో పాటు మాతృమూర్తి సమాధి ఎక్కడుందో కూడా చెప్పలేకపోవడం, కనీసం బర్త్ సర్టిఫికేట్ కూడా సమర్పించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
పోలీసుల వద్ద అంగీకారం.. చట్టపరమైన బాధ్యత
తాను బంగ్లాదేశ్ నుంచే అక్రమంగా సరిహద్దులు దాటి భారతదేశంలోకి ప్రవేశించినట్లు నిందితుడు పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాంగ్మూలం చట్టపరంగా ఎంతవరకు చెల్లుతుందనే అంశాన్ని పక్కనబెట్టినా, సహజ న్యాయ సూత్రాల ప్రకారం తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన ప్రాథమిక బాధ్యత సదరు వ్యక్తిదేనని కోర్టు పునరుద్ఘాటించింది.
వాటి ఆధారంగా పౌరసత్వం రాదు!
నిందితుడి వద్ద ఉన్న ఓటర్ ఐడీ, పాన్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డులను చూపించి పౌరసత్వాన్ని ఆపాదించలేమని జస్టిస్ దేబాంగ్షు బసాక్, జస్టిస్ మహమ్మద్ షబ్బర్ రషీదీలతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. పైగా సదరు వ్యక్తి పేరును ఓటర్ల జాబితా నుంచి గతంలోనే తొలగించినట్లు రికార్డులు చూపుతున్నాయని పేర్కొంది. కేవలం గుర్తింపు పత్రాలు ఉన్నంత మాత్రాన పౌరసత్వం దక్కదని, సరైన వంశపారంపర్య లేదా జనన ఆధారాలు సమర్పించనంత వరకు చట్టబద్ధమైన పౌరుడిగా గుర్తించడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications