పీవీ సింధు 'మన అమ్మాయి': రియో ఒలింపిక్స్ పతకం ఎవరి ఫలితం?
విజయవాడ: ఒలింపిక్స్లో రజతం సాధించిన పీవీ సింధును క్యాష్ చేసుకునేందుకు ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. సోమవారం తెలంగాణ ప్రభుత్వం, మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆమెను ఘనంగా సన్మానించారు.
సోమవారం నాడు జరిగిన సన్మాన సభలో తెలంగాణ మంత్రులు.. పీవీ సింధును పొగడటంతో పాటు ఆమె గెలుపులో తెలంగాణ పాత్ర ఉందని, అలాగే, క్రీడల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ కంటే అడుగు ముందు: సింధుకు భారీ బాబు ఆఫర్, గోపీకి భూమి
తాజాగా, మంగళవారం నాడు విజయవాడలో జరిగిన సన్మాన సభలో మంత్రి అచ్చెన్నాయుడు నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరకు సింధును ఉద్దేశించి 'మన అమ్మాయి' అని పలుమార్లు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
గతంలో సమైక్య పాలనలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో గోపీచంద్ అకాడమీకి ఐదు ఎకరాల భూమి ఇచ్చానని, అదే అకాడమీలో పీవీ సింధు రాటుదేలి, ఒలింపిక్స్ పతకం సాధించిందని చంద్రబాబు పేర్కొన్నారు. తాను ఇచ్చిన భూమిలో ఎదగడం తనకు సంతోషాన్నిస్తోందని చెప్పారు.
సన్మాన కార్యక్రమం సందర్భంగా అచ్చెన్నాయుడు పదేపదే 'మన అమ్మాయి' అని వ్యాఖ్యానించారు. 'మన బిడ్డ', 'మన తెలుగు తేజం', 'మన సింధు', 'మన పాప'.. అంటూ పదేపదే పేర్కొన్నారు. చంద్రబాబు తయారు చేసిన వజ్రం అన్నారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు కూడా మన అమ్మాయి అని చెప్పారు. కాగా, సన్మాన వేదిక పైన చంద్రబాబు.. పీవీ సింధుతో బ్యాడ్మింటన్ ఆడి ఆనందించారు.
సర్! మీ వల్లే: సింధుతో చంద్రబాబు షటిల్, 'గోపీచంద్కు స్థలం ఇవ్వకుంటే ఎక్కడిది'
సోమవారం నాడు తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి మాట్లాడుతూ.. మన రాష్ట్రానికి చెందిన అమ్మాయి ప్రపంచ స్థాయిలో గెలవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. తెలంగాణలో క్రీడాభివృద్ధికి కేసీఆర్ ఎంతో చేస్తున్నారని, దాని ఫలితమే రియోలో సింధు పతకం అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు.