రాజధాని అమరావతికి శుభదినం
Chandrababu: రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో గల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీనివాస కల్యాణం కన్నుల పండువగా జరిగింది. భారీ ఏర్పాట్ల మధ్య నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కల్యాణాన్ని చూసి తరించారు.
శ్రీవారి కల్యాణోత్సవానికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారికి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించారు.
విష్వక్సేనుడిని శ్రీవేంకటేశ్వర స్వామి సర్వసైన్యాధిపతిగా భావిస్తారు. స్వామివారి కళ్యాణోత్సవం, ఇతర ఉత్సవాలు, ఊరేగింపు ఆరంభం కావడానికి ముందు అక్కడి ఏర్పాట్లను ఆయన పర్యవేక్షిస్తారు. అందుకే- ఉత్సవాలకు ముందు విష్వక్సేనుడి ఆరాధానతో కల్యాణోత్సవం ప్రారంభమైంది.

అనంతరం అర్చకులు శుద్ధి- పుణ్యాహవచనం నిర్వహించారు. శుద్ధి చేసిన నీటిని హోమకుండం, మంటపంలోని అన్ని వస్తువులపై చల్లారు. అనంతరం ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ క్రతువులో అష్ట దిక్పాలకులను ఆవాహన చేసి పూజించారు. ఆ తరువాత ప్రతిష్టా బంధన క్రతువు చేపట్టారు. అర్చకులు పవిత్రమైన కంకణాలను ఉత్సవ మూర్తులకు కట్టారు.
అనంతరం ప్రాయశ్చిత్త హోమం, దేవతలకు కొత్త పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యాణోత్సవం సందర్భంగా తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరపున కన్యాదానం చేశారు. శ్రీనివాసుడి గోత్రం భారద్వాజ, శ్రీదేవి అమ్మవారిది భార్గవస, భూదేవి అమ్మవారిది కాశ్యపస గోత్ర ప్రవరాలను అర్చకులు పఠించారు. తరువాత మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది.

కల్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు శాస్త్రోక్తంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా వారు ఆలయం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపుగా శ్రీవారి కళ్యాణ వేదిక వద్దకు చేరుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు బహూకరించారు.
గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు నాయుడు దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు, కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాలను అందించారు.
ఈ సందర్భంగా చంద్రబాబుకు వివిధ పీఠాధిపతులు ఆశీర్వచనాలు పలికారు. తిరుమల పెద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అహోబిలం పీఠాధిపతి శివస్వామి, శ్రీకమలానంద స్వామి, ఇతర పీఠాధిపతుల నుండి ఆయన ఆశీస్సులను స్వీకరించారు.












Click it and Unblock the Notifications