"ఇలా చేస్తే NEET అక్రమాలకు చెక్ "- నందన్ నీలేకనికి ఏపీ మాజీ ఐఏఎస్ లేఖ..!
నీట్ (NEET)పరీక్షలో అక్రమాల నేపథ్యంలో నందన్ నీలేకని నేతృత్వంలో పలువురు నిపుణులు, విద్యావేత్తలతో కేంద్రం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ భవిష్యత్తులో నీట్ సహా పోటీ పరీక్షల్లో అక్రమాల నివారణకు కేంద్రం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ఐపీఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ (GSRKR Vijay Kumar) టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ నందన్ నీలేకనికి ఇవాళ ఓ బహిరంగలేఖ రాశారు.
నీట్ వంటి ప్రవేశ పరీక్షల్లో ఇంటర్మీడియట్ మార్కులకు 50 శాతం, ప్రవేశ పరీక్షకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని విజయ్ కుమార్ సూచించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షా కేంద్రాలను నగరాల్లో కాకుండా.. ముందుగా గ్రామీణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రాబల్య మండలాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూూఎస్ పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా కోచింగ్, మార్గదర్శకత్వం అందించాలన్నారు.

విచ్చలవిడిగా ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా ఆయన కోరారు. పీజీ, సూపర్ స్పెషాలిటీల్లో ప్రైవేట్ సీట్ల కోసం కటాఫ్ మార్కులను సున్నాకు తగ్గించి, పేద విద్యార్థుల సీట్లకు మాత్రం కఠిన నిబంధనలు ఎందుకని విజయ్ కుమార్ ప్రశ్నించారు. కొత్త నియామక పరీక్షల కంటే ముందే పెండింగ్లో ఉన్న రిజర్వేషన్ బ్యాక్లాగ్ ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. సమగ్ర ప్రవేశ ప్రక్రియ పేరుతో తెచ్చే ఎలాంటి కొత్త మూల్యాంకన విధానంలోనైనా రిజర్వేషన్ రక్షణలను చట్టబద్ధం చేయాలన్నారు. పరీక్షల సంస్కరణల కమిటీ తుది నివేదికను అటకెక్కించకుండా, పార్లమెంటు ముందు ఉంచి పూర్తిస్థాయి చర్చ జరపాలని విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications