మాస్టర్ డెవలపర్ కోసం మరోసారి టెండర్లు, సీఎం చెప్పారు: నారాయణ
విజయవాడ: మాస్టర్ డెవలపర్ కోసం త్వరలో మరోసారి టెండర్లు పిలుస్తామని ఏపీ మంత్రి నారాయణ బుధవారం నాడు చెప్పారు. రాజధాని అమరావతిలో 1,600 కి.మీ. రోడ్ల నిర్మాణం, అందులో 550 కి.మీ. మెయిన్ రోడ్లు, రోడ్ల ఎత్తు సముద్ర మట్టానికి 17 మీటర్లు ఉంటుందన్నారు.
రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. మంత్రులు, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతిలో చిన్నాపెద్ద కలిపి పదహారు వందల కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు. సముద్ర మట్టానికి పదిహేడు మీటర్ల ఎత్తు తగ్గకుండా రహదారులు నిర్మించాలని ఆయన సూచించారన్నారు.
శాసనసభ, మండలి భవనాల్లో సమీక్షలకు అనుగుణంగా సమావేశ మందిరం ఉంటుందని వివరించారు. ఆరో భవనమైన అసెంబ్లీ, మండలి సమావేశ మందిరాలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.
కాగా, అంతకుముందు చంద్రబాబు వెలగపూడిలో నూతనంగా నిర్మించిన సచివాలయంలోని సీఎం ఛాంబర్ను ఉదయం ప్రారంభించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మహూర్తానికి వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చంద్రబాబు తన ఛాంబర్లోకి అడుగుపెట్టారు.
కార్యక్రమంలో ఏపీ మంత్రులు చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, డీజీపీ సాంబశివ రావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు సీఎంకు అభినందనలు తెలిపారు. సీఎం ఛాంబర్లోని తన సీటులో ఆసీనులైన చంద్రబాబు రెండో విడత రుణ సహాయం దస్త్రంపై తొలి సంతకం చేశారు.