ఏపీ ప్రజలకు హెచ్చరిక: హైదరాబాద్-విజయవాడ రహదారిపైకి భారీగా వరద
అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయుగుండం ప్రభావంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్థాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్ష సహాయ చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయల చొప్పున తక్షణం విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
భారీ వర్షాలతో చనిపోయిన 8 మందికి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. భారీ వర్షాలు ఆదివారం కూడా ఉంటాయన్న సమాచారంతో ప్రతి ప్రభుత్వ విభాగం పూర్తి అప్రమత్తతో ఉండాలని చంద్రబాబు సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

తీరం దాటనున్న తుపాను
శ్రీకాకుళం-విశాఖ మధ్య శనివారం రాత్రికి తుపాను తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తీరం వెంట ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు మరింత అప్రమత్తతో ఉండాలన్నారు. వర్షాలు తగ్గేవరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాల్లో సహాయక చర్యల కోసం జిల్లాకు 3 కోట్ల రూపాయలు, కాస్త తక్కువ ప్రభావం ఉన్న జిల్లాలకు 2 కోట్ల రూపాయలు చొప్పున నిధుల విడుదల చేస్తున్నట్లు సీఎం తెలిపారు.
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు ఆదివారం కూడా జాగ్రత్తలు పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పట్టణాల్లో నీరు నిలిచిన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని, నీటి ప్రవాహాలకు ఉన్న అడ్డంకులను పొక్లెయిన్లతో తొలగించాలని సీఎం ఆదేశించారు. ఓపెన్ డ్రెయిన్లు ఉండేచోట హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. వరద ప్రాంతాల్లో వాగులపై వాహనాలను అనుమతించవద్దని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న వంతెనలపై రాకపోకలు నిలిపేయాలని స్పష్టం చేశారు.
తుపాను భవనాలు సిద్ధం చేసి పునరావాసానికి ఏర్పాట్లు చేయాలని సీఎం అన్నారు. భారీవర్షాలున్న జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించాలని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్న ఘటన జరిగినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. హుద్హుద్ సమయంలో తీసుకున్న విధానాలు అనుసరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించాలని ఆదేశించారు.
హైదరాబాద్-విజయవాడ రహదారిపైకి భారీగా వరద
భారీ వర్షాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కోదాడ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వాగు పొంగడంతో హైవేపైకి వరద వచ్చింది. ప్రస్తుతం కోదాడ-జగ్గయ్యపేట మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఖమ్మం వైపు, నార్కట్ పల్లి-అద్దంకి రహదారి వైపు మళ్లిస్తున్నారు.












Click it and Unblock the Notifications