ముంబై నటి వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టం: చంద్రబాబు వార్నింగ్
ముంబై నటి కాదంబరి జెత్వానీ వ్యవహారంలో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆమె విషయంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందని ధ్వజమెత్తారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు.
వ్యవస్థల్ని జగన్ ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శమని అన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా చిట్ చాట్లో చంద్రబాబు పలు విషయాలపై మాట్లాడారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని సీఎం అన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానని తెలిపారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం తనిఖీలు చేశారని చేశారు.

హాస్టల్లో ఎలాంటి పరికరాలు లబించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా, సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని చంద్రబాబు హెచ్చరించారు.
మరోవైపు, వైఎస్సార్సీపీలో ఇమడలేక చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చంద్రబాబు తెలిపారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే తీసుకుంటామన్నారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్మగ్లర్లకు హెచ్చరిక
రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లర్లు ఇన్నాళ్లూ ఆడిన ఆటలు ఇక సాగవన్న సీఎం చంద్రబాబు.. అడవిలో స్మగ్లర్లు అడుగుపెడితే ఇక అదే వారికి చివరి రోజని తీవ్రంగా హెచ్చరించారు. అడవుల సంరక్షణకు డ్రోన్లను వినియోగిస్తామన్నారు. స్మగ్లర్ల కంటే ముందే డ్రోన్లే అడవుల్లో ఉంటాయని తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఆక్సిజన్ తీసుకోవటం ఎంత అవసరమో.. ఆక్సిజన్ ఇచ్చే చెట్లు నాటటమూ అంతే ముఖ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్కులో ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో చంద్రబాబు పాల్గొన్న సందర్భం ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications