అది వైసీపీ వాళ్ల పనే.. ఇదీ వైసీపీ వాళ్ల పనే: చంద్రబాబు
Gudlavalleru Engineering College incident: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల బాత్రూమ్లల్లో హిడెన్ కెమెరాలు లభించాయంటూ వచ్చిన వార్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. అక్కడ ఎలాంటి కెమెరాలు లభించలేదని, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషప్రచారమేనని కొట్టిపారేశారు.
గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై సిగ్గు లేకుండా వైఎస్ఆర్సీపీ వ్యవహరించిందని, 300 వీడియోలు లభించినట్లు దుష్ప్రచారం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. మీకు ఎవడు చెప్పాడు..? అంటూ ఎదురుదాడికి దిగారు. ఆవేశంగా ఉన్న విద్యార్థులను నచ్చజెప్పాల్సిన బాధ్యత, అసలు ఈ ఘటన జరిగిందా? లేదా? అని తెలుసుకోవాల్సింది తానేనని గుర్తుచేశారు.

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన సోమవారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ హిడెన్ కెమెరాలు పెట్టివున్నట్లు తేలితే కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జరక్కపోతే జరగలేదని చెప్పి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపకుండా 300 వీడియోలు తీశారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు విష ప్రచారం చేశారని చంద్రబాబు విమర్శించారు.
ఆడపిల్లల శీలాన్ని లెక్కలేకుండా చూస్తున్నారని, ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులను చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీలో ఎంతోమంది చరిత్రహీనులు ఉన్నారని, ఆడబిడ్డల పట్ల దారుణంగా ప్రవర్తించిన వాళ్లు ఉన్నారని చెప్పారు.
ఏమీ లేని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల ఉదంతం పట్ల అతిగా స్పందించి ఆడపిల్లల భవిష్యత్ను అంధకారంలోకి తెచ్చారని, ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ ఘటన పట్ల ఎక్స్పర్ట్ కమిటీని వేశామని, పోలీసులతో దర్యాప్తు జరిపిస్తున్నామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని తేల్చి చెప్పారు.
వాళ్ల రాజకీయ భవిష్యత్తు కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతకైనా తెగిస్తారని, అలాంటి భూతమే ఆ పార్టీ అని ఆరోపించారు. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల కోసమే పని చేయాలని, దాని ద్వారా లబ్ది పొందాలే తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదని అనుకుంటే ప్రమాదమని అన్నారు.
కొందరు క్రిమినల్స్ రాజకీయాల్లో ఉన్నారని, వాళ్ల వల్ల ప్రతిరోజూ ప్రజలకు, తనకూ ఎన్నో అనుమానాలు వస్తూనే ఉంటాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రెండు బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టాయని, దానివల్ల కొంత డ్యామేజీ జరిగిందని, వాటిని ఎలా సరిచేయాలనేది చర్చిస్తామని అన్నారు.
రాష్ట్రంలో, రాష్ట్ర రాజకీయాల్లో కొందరు క్రిమినల్స్ ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉద్దేశపూరకంగా గేట్లను ధ్వంసం చేయాలనే కారణంతో ప్రకాశం బ్యారేజీలోకి బోట్లను వదిలి ఉండొచ్చనే అనుమానాలను కొట్టిపారేయడానికి వీలు లేదని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications