సమైక్య తీర్మానంపై చెప్పను: కిరణ్ రెడ్డి, బొత్స ప్రొఫార్మా
హైదరాబాద్: శాసనసభలో సమైక్య తీర్మానం ప్రతిపాదిస్తామా లేదా అనేది ఇప్పుడు చెప్పబోనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. 1998లో బీహార్ విభజనను వ్యతిరేకించిందని ఆయన అన్నారు. ఓటింగు జరగకుండా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఏర్పడలేదని ఆయన అన్నారు. అభిప్రాయాలు చెప్పడమంటే ఓటింగ్ జరగడమేనని ఆయన శనివారంనాడు అన్నారు.
మూజువాణి లేదా ఓటింగు ద్వారా విభజన జరుగుతుందని ఆయన అన్నారు. ఓటింగుతోనే 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని ఆయన గుర్తు చేశారు. ఏ తీర్మానం చేయాలన్నా బిల్లుపైనే చేయాలని, తీర్మానం చేస్తే బిల్లును ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అన్నారు.

సోమవారంనుంచి తెలంగాణ ముసాయదా బిల్లుపై చర్చ జరగుతుందని ఆశిస్తున్నట్లు కిరణ్ రెడ్డి తెలిపారు. బిల్లుపై చర్చకు అన్ని పార్టీలూ సహకరించాలని ఆయన కోరారు. ప్రతి సభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చునని ఆయన అన్నారు. బిల్లుపై చర్చ ప్రారంభమైతే గానీ గడువు పొడగించాలా, లేదా అనేది తెలియదని ఆయన అన్నారు. బిల్లుపై సాధారణ చర్చనా, క్లాజులవారీగా చర్చనా అనేది నిర్ణయించాల్సి ఉందని ఆయన చెప్పారు. చర్చ జరిగితేనే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా తీర్మానం చేస్తే ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారని ఆయన అడిగారు.
రాజకీయాల్లో జయాపజయాలు సహజమని, అయితే కాంగ్రెసులో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని కొందరు భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. జనవరి 23వ తేదీ తర్వాత రెండు రోజుల పాటు సమావేశమై ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. తాను సీమాంధ్ర ప్రజలతో వెళ్తున్నానని, విభజన వద్దని చెప్పినా అధిష్టానం వినలేదని ఆయన చెప్పారు. చిత్తూరు జిల్లాకు 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజుకు వందలాది ఫైళ్లు క్లియర్ అవుతాయని, ఆరోపణలు చేసినప్పుడు రుజువులు ఉండాలని ఆయన అన్నారు. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు నష్టమని ఆయన అన్నారు. విభజన జరుగుతుందో లేదో చెప్పడానికి జ్యోతిష్కుడిని కానని ఆయన అన్నారు. శ్రీధర్ బాబు లేఖ అందినట్లు ఆయన తెలిపారు.
కాగా, బిల్లుపై సీమాంధ్ర శాసనసభ్యులు అభిప్రాయాలు చెప్పడానికి ప్రొఫార్మా తయారు చేసినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. చర్చ ఎలా ప్రారంభించాలో, ఎలా ముగించాలో ప్రొఫార్మాలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. సభ్యులు తమ ప్రసంగాన్ని ప్రొఫార్మాకు జత చేసి ఇవ్వాలని ఆయన సూచించారు.
ప్రొఫార్మా ప్రతులను సీమాంధ్ర సభ్యులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మాట్లాడాల్సిన విషయాలను ప్రొఫార్మాలో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించాలని తాము కోరుతామని ఆయన చెప్పారు. పార్టీని విమర్శించేవారికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications