విశాఖలో జగన్ కు నిరసన సెగ-ఎయిర్ పోర్టు బయట సీఎం గో బ్యాక్ ఆందోళనలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలపై నిత్యం విమర్శలకు దిగుతున్న టీడీపీ ఇప్పుడు ప్రత్యక్షంగా జగన్ ను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా టీడీపీ యువజన విభాగం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఇవాళ విశాఖలో ఆందోళనకు దిగింది.
సీఎం జగన్ వైజాగ్ టూర్ లో భాగంగా ఇవాళ ఉదయం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్టు బయట కాచుకుని ఉన్న టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సీఎం గో బ్యాక్ నినాదాలతో పోస్టర్లు పట్టుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. సీఎం జగన్ ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చేసమయంలో నిరసన తెలిపేందుకు నగరానికి చెందిన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వీరిని అడ్డుకుని అక్కడి నుంచి తరలించే క్రమంలో కాసేపు ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.
సీఎం జగన్ ఇవాళ వైజాగ్ లో వైఎస్సార్ వాహనమిత్ర పథకం మూడో ఏడాది నిధుల విడుదల కోసం వచ్చారు. సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లకు వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ప్రభుత్వం ఏటా రూ.10 రూపాయలు ఇస్తోంది. వాహనాల రిపేర్లు, ఇతర అవసరాల కోసం ఈ డబ్బులు కేటాయిస్తోంది.
ఈ ఏడాది కూడా నిధుల విడుదల కార్యక్రమం చేపట్టిన ప్రభుత్వం.. వైజాగ్ లో అధికారికంగా సీఎం చేతుల మీదుగా దీన్ని నిర్వహిస్తోంది. దీనిపై ఆగ్రహంతో టీఎన్ఎస్ఎఫ్ నిరసనలకు దిగుతోంది. దీంతో ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిగా చెబుతున్న విశాఖలో స్వయంగా సీఎం జగన్ కు నిరసనల సెగ తగులుతోంది.