వారికి టిక్కెట్ లేనట్లే - డోన్ట్ కేర్ : ఎవరు ఏ స్థానంలో - సచివాలయానికి 25 లక్షలు : సీఎం జగన్..!!
పార్టీ ఎమ్మెల్యేలకు తన ఆలోచనలు ఏంటో స్పష్టం చేయటంతో పాటగా.. ఎవరికి టిక్కెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాయో ముఖ్యమంత్రి జగన్ తేల్చి చెప్పారు. పార్టీ ఎమ్మెల్యేలతో గడప గడపకు ప్రభుత్వం నిర్వహణ పైన వర్క్ షాప్ నిర్వహించిన జగన్...ఏ ఎమ్మెల్యే ఎన్ని రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నదీ పూర్తి వివరాలు వారి ముందుంచారు. అందులో పది రోజుల్లోపు వెళ్లిన వారి సంఖ్య 22 ఉండగా.. అసలు ఇప్పటి వరకు కార్యక్రమం ప్రారంభించని ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నట్లుగా తేల్చారు. ఈ సమావేశంలో సీఎం జగన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

పార్టీ టిక్కెట్లు దక్కాలంటే
తాను చేయగలిగిందంతా చేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేలుగా తిరిగి రావాలనుకుంటే కష్టపడండి.. లేదనుకుంటే తనకు ఇబ్బంది లేదని సీఎం స్పష్టం చేసారు. 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వారికి న్యాయం జరగాలంటే వైసీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. గతం కంటే మెరుగైన ఫలితాలతో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని సీఎం విశ్లేషించారు. మరోసారి కుప్పం నియోజకవర్గం గురించి సీఎం ప్రస్తావించారు. ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తామన్నారు.

నిధులు ఇస్తున్నా.. మీ చేతిలోనే ఉంది
రాష్ట్రంలోని ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.25 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు జీవో సైతం జారీ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయిస్తున్నట్లు వివరించారు. గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలని నిర్దేశించారు. వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు- గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పర్యవేక్షణకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో పరిశీలకుడిని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక, సీనియర్ నేతలు ఆళ్ల నాని- కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పటి వరకు అసలు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించకపోవటం పైన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు.

మంత్రులు - సీనియర్లపై ఆగ్రహం
అందరి కంటే ఎక్కువగా ఈ కార్యక్రమంలో విప్ ప్రసాద రాజు తొలి స్థానంలో నిలిచారు. మరో 15 మంది ఎమ్మెల్యేలు అయిదు రోజులకే కార్యక్రమం ముగించినట్లుగా సీఎం నియోజకవర్గాలతో సహా తాను సేకరించిన సమాచారం వెల్లడించారు. ఇక, ఇద్దరు సీనియర్ మంత్రులు పది రోజుల కంటే తక్కువగా నియోజకవర్గంలో తిరిగినట్లుగా సీఎం తేల్చారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..బొత్సా సత్యానారాయణ ఇద్దరూ ఆ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం నిధుల సమస్య ఉన్నా.. ప్రతీ సచివాలయంలో రూ 25 లక్షల చొప్పున నిధులు కేటాయించటం తాను చాలెంజ్ గా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ప్రజలతో కలిసి పార్టీ ఎమ్మెల్యేగా పని చేస్తేనే టిక్కెట్ వస్తుందని.. లేకుంటే తనకు వచ్చే నష్టం లేదని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications