సీఎం జగన్ ఏరియల్ సర్వే: ముంపు ప్రాంతాల పరిశీలన
ఏపీలో జలవిలయం కొనసాగుతోంది. ముఖ్యంగా సీమ జిల్లాలపై ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకున్న ఆయన.. సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమైన నేవీ సిబ్బందిని కలుసుకున్నారు. జిల్లాలో వరద పరిస్థితులపై స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లతో మాట్లాడారు. తర్వాత హెలికాప్టర్ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు.
సీఎం ఏరియల్ సర్వే
భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతోపాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేశారు. తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు.
జగన్ డిస్కషన్స్
రేణిగుంట ఎయిర్పోర్టులో అధికారులతోనూ, ప్రజా ప్రతినిధులతో సీఎం జగన్ మాట్లాడారు. తిరుపతి టౌన్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు. వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్ ప్లాన్ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వెంటనే రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు.
వర్ష ప్రభావం
చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలొ ఎక్కడ చూసినా.. వరదనీరే దర్శనం ఇస్తోంది. మెట్ల దారి గుండా నీరు ప్రవహిస్తోంది. పలు కాలనీల్లో కూడా వరదనీరు ఏరును తలపిస్తోంది. కడప జిల్లాలో నిన్న మూడు బస్సులు కొట్టుకపోయిన సంగతి తెలిసిందే. కోస్తాంధ్రలో కూడా వర్ష ప్రభావం ఉంది.