సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు - ఆర్బాటం..హంగామా చేయం : పది రోజుల్లో ఉద్యోగాలు..!!
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలోని కృష్ణానగర్ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు. వరద బాధితుల నుంచి వారికి జరిగిన నష్టం పైన ఆరా తీస్తున్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి ఇచ్చారు.

బాధితులకు సహాయం ముఖ్యం
బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు. అదే సమయంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేసారు. వరదలు వచ్చి 14 రోజులైందన్నారు. మన అధికారులు, సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొన్నారనేది చూడటానికి ముఖ్యమంత్రి హోదాలో తాను వచ్చానన్నారు. ఇంత పకడ్బంధీగా, ఇంత కచ్చితంగా, మోస్ట్ ఎఫీషియెంట్గా.. ఆర్భాటం, హంగామా లేకుండా సహాయ కార్యక్రమాలు కొనసాగాయని వ్యాఖ్యానించారు.

అంతా పద్దతి ప్రకారం చేస్తున్నాం
ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది కాబట్టే అందరికీ మేలు జరుగుతోందని సీఎం వివరించారు. వరద ప్రభావిత కాలనీల్లో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. పొలాల్లో పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ప్రభుత్వం ప్రతి హెక్టారుకు రూ.12,500 చొప్పున ఇస్తుందని.. ఈ జాబితాలో ఎవరైనా మిస్ అయితే ఫిర్యాదు చేయొచ్చంటూ సీఎం చెప్పుకొచ్చారు. ఈ-క్రాప్లో నమోదు చేసుకున్న రైతులందరికీ పరిహారం ఇస్తామన్నారు. తమకు టైటిల్ డీడ్ లేదని చాలా మంది ఫిర్యాదు చేశారు.

బాబ్ మేళాలు నిర్వహిస్తాం.. ఉద్యోగాలు కల్పిస్తాం
అందుకే ఈ-క్రాప్ డేటా ఆధారంగా అందరికీ పరిహారం ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించామని సీఎం చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలు నష్టపోయామంటూ వాపోతున్నారని..వారిని ఆదుకొనేందుకు నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జాబ్ మేళాలు పెట్టి.. ఔట్ సోర్సింగ్ లేదా ప్రైవేటు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకులతో మాట్లాడి రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. ఇదంతా పది రోజుల్లో జరుగుతుందని సీఎం వారికి హామీ ఇచ్చారు.

ప్రతీ ఒక్కరికీ అండగా నిలుస్తాం
ప్రత్యేకంగా ఆరుగురు డిప్యూటీ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించాం. వారంతా ఆదివారం వరకు ఇక్కడే ఉంటారు. అన్ని పనులు పర్యవేక్షిస్తారని సీఎం వివరించారు. నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తరువాత ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత ఉండవల్లి తిరుగు పయణమవుతారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతి పర్యటనలో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కలిసారు. పీఆర్సీ పైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రక్రియ పూర్తయిందని.. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications