విశాఖలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీ- సీఎం జగన్ నిర్ణయం : నియోజకవర్గానికో ఐటీఐ..!!
విశాఖను ఏపీ పరిపాలనా రాజధానిగా ప్రకటించిన సీఎం జగన్..ఇప్పుడు అక్కడ ఒక కీలక విద్యా సంస్థను తీసుకురావాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా తిరుపతిలో స్కిల్ యూనివర్శిటీని పెట్టబోతున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్య ప్రణాళిక అనేది హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్ యూనివర్శిటీలు రూపొందిస్తాయని వెల్లడించారు. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గానికి నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కళాశాలను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలకు, వర్క్ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనివల్ల మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్పై సమీక్ష చేసిన సీఎం జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖపట్నంలో హై ఎండ్ స్కిల్స్ యూనివర్శిటీ పనులను వెంటనే మొదలు పెట్టాలని ఆదేశించారు.
నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలని.. స్కిల్ డెవలప్మెంట్ కళాశాలలతో పాటు కొత్తగా నిర్మించనున్న వైద్య కళాశాలల తరగతి గదుల నిర్మాణంలో వినూత్న పద్ధతులు పాటించాలని సూచించారు. ప్రతి ఐటీఐలోనూ నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ఆలోచన చేయటం ద్వారా.. నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద నైపుణ్య అభివృద్ధి శిక్షణ పొందిన వారి డేటాను పంపించాలని సూచించారు.
75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. తాగునీటి ప్లాంట్లు, మోటార్లు, సోలార్ యూనిట్లు.. ఇలా రోజువారీగా మనం చూస్తున్న చాలావరకు అంశాల్లో నిర్వహణ, మరమ్మతుల్లో వారికి నైపుణ్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న వైద్య కళాశాలలు, ఆస్పత్రులను నిర్వహణ కోసం నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సీఎం జగన్ తెలిపారు. నియోజకవర్గానికి ఒక ఐటీఐ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు.
నియోజకవర్గ స్థాయిలో తప్పనిసరిగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్ధ ఏర్పాటవుతుందన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో అవసరమైన టీచింగ్ స్టాఫ్ను పెట్టాలని... ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో టీచింగ్ సిబ్బందిపై పరిశీలన చేయాలని సీఎం నిర్దేశించారు. ప్రతినెలా మూడురోజులపాటు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యేలా వారికి కేటాయించాలని మరో సారి స్పష్టం చేసారు. ఐటీఐలు, నైపుణ్యాభివృద్ధి కళాశాలల్లో అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని... శిక్షణ పొందిన వారికి అప్రెంటిస్షిప్ వచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. నిపుణులతో బోధన చేయించేటప్పుడు డిజిటల్ పద్ధతిలో పొందుపర్చాలని సీఎం జగన్ స్పష్టం చేసారు