నా వెనుక ఉన్నది ఆ నలుగురే : 2024 ఎన్నికల నినాదం ప్రకటించిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. చంద్రబాబు పెత్తందార్లు -నా పేదల మధ్యే యుద్దం అంటూ ఎన్నికల నినాదం ప్రకటించారు. బీసీలంటే సమాజానికి బ్యాక్ బోన్ అని స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో పార్టీలోని బీసీ నేతల పాత్ర ఎలా ఉండోలా తేల్చి చెప్పారు. వైసీపీ విజయవాడ కేంద్రంగా నిర్వహించిన జయహో బీసీ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు. తన వెనుక ఉన్న బలం ఏంటో వివరించారు. బీసీలకు చంద్రబాబు చేసిన అన్యాయం పైన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరి మద్య పోటీనో వివరించారు. 2019 మించి 2024 లో 175 సీట్లు గెలవాలని నిర్దేశించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

వైసీపీ మేనిఫెస్టో - ఆత్మ ఆ నలుగురే
ముఖ్యమంత్రి జగన్ ఈ సభలో బీసీలకు మద్దతుగా ఈ మూడున్నారేళ్ల కాలంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. సామాజిక న్యాయంలో ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందీ చెప్పుకొచ్చారు. బీసీలకు మేలు చేయటం అంటే కొన్ని పరికరాలు ఇవ్వటం కాదని.. సామాజికంగా - ఆర్దికంగా నిలబెట్టమని సీఎం జగన్ పేర్కొన్నారు. 45 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి 49 ఏళ్ల వయసు ఉన్న మనిషి చేసిన విధంగా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పటం లేదని..అలా చెప్పుకోవటానికి ఏం చేయలేదని సీఎం ఎద్దేవా చేసారు. ప్రతీ పార్టీకి ఫిలాసఫీ ఉంటుందని.. వైసీపీకి మేనిఫెస్టో..ఆత్మ తన బీసీ..తన ఎస్సీ..తన ఎస్టీ..తన మైనార్టీలేనని సీఎం వివరించారు. చంద్రబాబు లాగా దుష్టచతుష్ఠయం తన వెనుక లేదన్నారు. తన వెనుక ఉన్నది బీసీ - ఎస్సీ- ఎస్టీ- మైనార్టీ- పేద ప్రజలేనని ముఖ్యమంత్రి వివరించారు. మూడున్నారేళ్ల కాలంలో సామాజిక న్యాయం - సాధికారత లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు
మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు. ఇది ఎప్పటికీ మన అనుబంధమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు.. బీసీలంటే బ్యాక్బోన్ క్లాసులని, బీసీలంటే వెనుకబడిన కులాలు కాదని, బీసీలంటే వెన్నెముక కులాలనీ చాటిచెబుతూ మూడున్నర సంవత్సరాల కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ అడుగు పడుతున్నాయని వివరించారు. వచ్చే ఎన్నికల్లో
మంచికి చెడుకు.. నిజాయితీకి -నయవంచనకు, సామాజిక న్యాయానికి- అన్యాయానికి, పేదల భవిష్యత్ కు - పేదలుగానే ఉండాలనే వారితో యుద్దం జరుగుతుందని చాటి చెప్పండని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చంద్రబాబు పెత్తందార్లు - తన పేదల మధ్యే అసలైన వచ్చే ఎన్నికల్లో అసలైన పోరాటమని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వంలో...పార్టీలో..స్థానిక సంస్థల్లో బీసీలకు కేటాయించిన పదవులను సీఎం జగన్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు 3,19,000 లక్షల కోట్లు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అందించామని చెప్పారు. దీనిలో 2,50,358 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాల కోసమే ఖర్చు చేశామని..అంటే 80 శాతం పేద, సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

బీసీ నేతలు బూత్ కమిటీలుగా ఏర్పడండి..
ఇదే సమయంలో ముఖ్యమంత్రి తాను నమ్ముకున్న..తనను నమ్మిన బీసీ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రతీ నియోజవకర్గంలో బీసీలంతా బూత్ కమిటీలుగా ఏర్పాటవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతీ 50 ఇళ్లకు ఓనర్ షిప్ తీసుకోవాలని నిర్దేశించారు. ఈ ప్రభుత్వంలొ బీసీ - ఎస్సీ-ఎస్టీ- మైనార్టీ- పేదలకు జరుగుతున్న మంచిని వివరించాలని కోరారు. ఈ సారి టార్గెట్ 175కి 175 సీట్లు గెలవటమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేసారు. అప్పుడు చంద్రబాబు బీసీ కులాల తోకలు కత్తిరిస్తా అన్నారని..ఎస్సీగా పుట్టాలని ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అనేవారని గుర్తు చేసారు. ఇవాళ బడ్జెట్లోనే కాదు తన గుండెల్లో సామాజిక కులాలకు చోటు కల్పించానని జగన్ చెప్పారు. రాజకీయ సాధికారతలో అధికారంలో వాటా ఇవ్వటం అంటే ఏంటో చూపించామన్నారు. మాటలతో కాదు చేతుల్లోనే ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చామని ముఖ్యమంత్రి వివరించారు. చంద్రబాబు కనీసం ఒక్క బీసీని అయినా రాజ్యసభకు ఎందుకు పంపించ లేకపోయారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications