గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం: కేసీఆర్ తో కలిసి చర్చలు: సీఎం జగన్..!!
రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్ స్పష్టం చేసారు. నంద్యాలో నెలకొన్ని వదర పరిస్థితి పైన ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే చేసారు. ఆ తరువాత నంద్యాలలో అధికారులతో సమీక్ష చేసారు. వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు. నంద్యాల ప్రాంతంలో భవిష్యత్ లో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని జగన్ ప్రకటించారు.

రాయలసీమకు నీళ్లు
ముఖ్యమంత్రి జగన్ నంద్యాలలో వరద నీటి ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసారు. నాలుగు రోజులుగా అక్కడ నెలకొన్ని పరిస్థితి పైన ఆరా తీసారు. జిల్లా అధికారులతో..ప్రజా ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో వరద ప్రాంతాలను సీఎం జగన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. రాయలసీమలో ఈ స్థాయి వర్షాలను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు.

కేసీఆర్ తో చర్చలు..
వరద బాధితుల పట్ల అధికారులు మానవత్వం చూపాలని జగన్ సూచించారు. కృష్ణా ఆయకట్టు, రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి తెలంగాణ సీఎంతో మాట్లాడి గోదావరి నీళ్లను కృష్ణా నదికి అనుసంధానం చేయడానికి తగిన చర్యలు తీసుకోబోతున్నామని సీఎం జగన్ తెలిపారు. భవిష్యత్తులో రాయలసీమలోని ప్రతి డ్యామును నీటితో నింపుతామన్నారు.

ప్రతి కుటుంబానికి రూ.2 వేలు
నంద్యాల డివిజన్లోని 17 మండలాల్లో నష్టం జరిగిందని స్పష్టం చేశారు. 43 వేల హెక్టార్లలో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. రూ.784 కోట్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వరదలు రాకుండా కలెక్టర్లు శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.2 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. వరద బాధితులకు గతం కంటే 15శాతం అదనంగా ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

వరద బాధితుందరికీ ఇళ్లు..
వరదల కారణంగా 31వేల హెక్టార్లలో పంటనష్టం, 2వేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. భవిష్యత్తులో కుందు నది పరివాహక ప్రాంతంలో, నంద్యాల ప్రాంతంలో వరద నష్టం జరగకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని జగన హామీ ఇచ్చారు. నంద్యాలలో చామ కాల్వ వెడల్పు, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి అప్పట్లో వైయస్ చర్యలు ప్రారంభించారని.. అవి మధ్యలోనే ఆగిపోయానని వివరించారు. త్వరలోనే వాటిని తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

పంట నష్టం వివరాలు త్వరలో..
వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని.. సాధారణంగా ఇచ్చే వరద సాయం కంటే ప్రతి ఇంటికి అదనంగా రూ.2 వేలు ఎక్కువ ఇస్తామన్నారు. వరద బాధితులుందరికి ఇళ్లు కట్టిస్తామని జగన్ స్పష్టం చేశారు. వరద బాధితులకు.. వరదల్లో కొట్టుకుపోయిన రెండు కుటుంబాలకు చెందిన వారికి ప్రభుత్వం తరపున మంత్రులు ఆర్దిక సాయాన్ని అందించారు. వరద..పంట నష్టం వివరాలను త్వరగా అందించాలని జిల్లా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.












Click it and Unblock the Notifications