రెండు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తా- ప్రాక్టికల్ గా ఆలోచించండి : ఉద్యోగ సంఘాలకు సీఎం జగన్ సూచన..!!
ఏపీలో పీఆర్సీ కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు.. పెన్షనర్లకు మరో రెండు లేదా మూడు రోజుల పాటు వేచి చూడక తప్పేలా లేదు. ఉద్యోగ సంఘాలను సీఎంతో చర్చలకు ఆహ్వానించటంతో ఈ రోజే ఖచ్చితంగా పీఆర్సీ పైన ప్రకటన ఉంటుందని అందరూ అంచనా వేసారు. కానీ, ప్రకటన రాలేదు. ఉద్యోగ సంఘాల నేతల సమావేశాల పైన అధికారుల నుంచి ముందుగానే పూర్తి సమాచారం తీసుకున్న ముఖ్యమంత్రి .. ఉద్యోగ సంఘాల నేతలతోనూ చర్చించారు. వారితో చర్చించే సమయంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేసారు.
ఉద్యోగుల సమస్యలు వింటూనే బుజ్జగింపులు
ఉద్యోగుల సమస్యలను పూర్తగా సానుకూల ఆలోచనతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలు ప్రాక్టికల్ ఆలోచించాలి.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం మోయలేని భారాన్ని వేయవద్దని ఉద్యోగ సంఘాల నేతలను కోరినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల వారీగా సీఎం సమావేశమై..వారి నుంచి పూర్తి సమాచారం రాబట్టారు. వారి నుంచి చెప్పిన అభిప్రాయాలను పూర్తిగా విన్న సీఎం జగన్..రెండు లేదా మూడు రోజుల్లోనే పీఆర్సీ పైన అధికారికంగా ప్రకటన చేస్తామని స్పష్టం చేసారు. ఇప్పటికే అమలు చేస్తున్న 27 శాతం ఐఆర్ గురించి చెప్పుకొచ్చారు. ఆర్దికంగా కష్టాలు ఉన్నా తమ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వ మని చెబుతూ..తమ పధకాల అమలు..పాలనలో ఉద్యోగులు కీలకమని చెప్పారు.
రెండు మూడు రోజుల్లో ప్రకటన
పీఆర్సీ పైన అధ్యయనం చేసిన సీఎస్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. తమకు 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్న సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం కంటే అధికం గా ఫిట్ మెంట్ సీఎం ఇస్తారంటూ ఆశాభావం వ్యక్తం చేసాయి. అయితే, ఆ ప్రకటన సమయంలో మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలిచి..వారి సమక్షంలోనే ఫిట్ మెంట్ ప్రకటిస్తారని తెలుస్తోంది. శనివారం దీనికి సంబంధించి సమావేశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఈ రోజు సీఎం జగన్ ఖచ్చితంగా పీఆర్సీ పైన స్పష్టత ఇస్తారని ఉద్యోగ సంఘాల నేతలు సైతం అంచనా వేసారు.
సీఎం నిర్ణయం ఆధారంగానే స్పందన
ఉద్యోగ సంఘాల నేతలు ఒక దశలో 27 శాతం ఐఆర్ ఇస్తున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఫిట్ మెంట్ కు తగ్గకుండా దాని కంటే మెరుగ్గా ప్రకటన ఉండాలని కోరారు. సచివాలయ ఉద్యోగ సంఘ నేత 34 శాతం ఫిట్ మెంట్ ప్రకటించాలని సీఎం ను కోరారు. ముఖ్యమంత్రి స్వయంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేయటం.. అందునా తాను సైతం ఉద్యోగుల కుటుంబ సభ్యుడిగానే.. మంచి చేసేందుకు నిర్ణయం తీసుకుంటానని చెప్పటం తో ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు సైతం సీఎం నిర్ణయం వైపు ఆశతో ఉన్నారు. తాను పాలనా పరంగా అన్నింటి నీ స్ట్రీమ్ లైన్ చేస్తున్నానని.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం పైన సానుకూలంగా నిర్ణయాలు వస్తాయంటూ సీఎం హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.