CM Jagan: సొంత జిల్లాలో సీఎం జగన్ బోటు షికారు - ప్రకృతి అందాలతో..!!
CM Jagan Boating: నిత్యం సమీక్షలు..సమావేశాలతో బిజీగా ఉండే సీఎం జగన్ కాసేపు సరదాగా గడిపారు. సొంత జిల్లా వైఎస్సార్ కడపలో రెండు రోజుల పర్యటన కోసం ఆయన జిల్లాకు చేరుకున్నారు. కడప నుంచి పార్నపల్లికి హెలికాప్టర్ లో వచ్చారు. పార్టీ నేతలు..అధికారులు సీఎంకు స్వాగతం పలికారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో బోటింగ్ జెట్టిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. చిత్రావతి రిజర్వాయర్ లో పాంటున్ బోటులో ముఖ్యమంత్రి కాసేపు విహరించారు.చిత్రావతి లేక్ వ్యూ ప్రకృతి అందాలను ముఖ్యమంత్రి ఆస్వాదించారు.
బోటింగ్ లో సీఎం జగన్..సరదాగా
ముఖ్యమంత్రి జగన్ లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అక్కడే బోటింగ్ జెట్టిని ప్రారంభించిన సీఎం లైఫ్ జాకెట్ ధరించి రిజర్వాయర్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులతో కలిసి బోటింగ్ చేశారు.
ఆ సమయంలో సీఎం జగన్ చాలా రిలాక్స్డ్ గా కనిపించారు. సరదాగా బోటింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్..డిప్యూటీ సీఎం మంత్రి అంజాద్ బాషా.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు సీఎంతో పాటు బోటులో ఉన్నారు.
ఇడుపుల పాయలో రాత్రికి బస
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విదంగా రూ.4.1 కోట్లతో నిర్మించిన లేక్ వ్యూ రెస్టారెంట్..పార్కును సీఎం ప్రారంభించారు. అదే విధంగా.. రూ.1.5 కోట్లతో ఏర్పాటు చేసిన బోటింగ్, జెట్టీలో పాంటున్ బోటు (15 కెపాసిటీ),డీలక్స్ బోట్ (22కెపాసిటీ), 6 సీటర్ స్పీడ్ బోట్ ,4 సీటర్ స్పీడ్ బోట్ లు ఉన్నాయి.
అదే విధంగా పర్యాటకుల భద్రతా చర్యల్లో బాగంగా స్టేట్ డిసాస్టర్ రిస్క్యూ (ఎస్ డి ఆర్) బోట్, ఫైర్ సర్వీస్ బోట్ లను,లైఫ్ జాకెట్లను అందుబాటులో వుంచారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. లేక్ వ్యూ పాయింట్ వద్ద నుండి రిజర్వాయర్ అందాలను తిలకించిన సీఎం అక్కడ టూరిజం స్పాట్ గా డెవలప్ చేయటం పైన కొద్ది సేపు ముచ్చటించారు. ఈ సాయంత్రం సీఎం జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు.
రెండో రోజు పర్యటన షెడ్యూల్ ఇలా..
డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్ ఎస్టేట్ నుంచి బయలుదేరి హెలికాఫ్టర్లో బయలుదేరి పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన ఎస్సీఎస్ఆర్ గార్డెన్స్కు వెళ్తారు. 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం 9.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్లో కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి సీఎం జగన్ బయల్దేరుతారు.