'ఈనాడు'కు, రామోజీరావుకు జగన్ అంటే ఇష్టం లేదు...!!
'ఈనాడు'కు, రామోజీరావుకు జగన్మోహన్రెడ్డి అంటే ఇష్టం లేదు... అంత మాత్రానికే పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటారా? అని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు. విద్యావ్యవస్థపై తప్పుడు వార్తలు రాయకూడదన్నారు. విద్యాశాఖ పనితీరుపై తన క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా యల్లో మీడియా వ్యతిరేక వార్తలు రాస్తోందని మండిపడ్డారు. వాస్తవాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించి చెప్పాలని అధికారులకు సూచించారు.
పుస్తకాల్లో అదనపు సమాచారాన్ని జోడిస్తారని, దానివల్ల టెక్ట్స్బుక్ సైజు పెరిగిందని, బైలింగువల్ టెక్ట్బుక్స్లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషులో ఉంటుందన్నారు.రెండో సెమిస్టర్ ప్రారంభమైనా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను విద్యాశాఖ అధికారులు ఖండించారు. సహజంగా రెండో సెమిస్టర్ డిసెంబరు నెలలో ప్రారంభమవుతుందని, ముందుగానే ఆ విషయాన్ని అకడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసి కూడా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమయ్యేలా కథనాలు రాశారని సీఎం దృష్టికి తెచ్చారు.
ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, ఇంగ్లిషు మీడియంకు, ప్రభుత్వ విద్యారంగానికి వారు వ్యతిరేకమని, అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇంగ్లిషు మీడియంలో విద్యను పేద పిల్లలకు అందించడం వారికి ఇష్టం లేదని, రాజకీయంగా జగన్ ను ఇబ్బంది పెట్టడానికే ఇలా రాస్తున్నారన్నారు. రాజకీయంగా జరుగుతున్న యుద్ధంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.