ఆ రెండింటిపై ముఖ్యమంత్రి జగన్ సీరియస్!! నేతలతో సమాలోచనలు?
రానున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే కష్టపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం సర్వేతోపాటు వివిధ సంస్థలు, ఏజెన్సీలు సర్వేలు చేసి ముఖ్యమంత్రికి నివేదికను అందజేశాయి. వీటి ప్రకారం ఎక్కడెక్కడ ఏయే మార్పులు చేయాలి అనే అంశంపై ఆయన తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. అన్ని సంస్థలు అందించిన సర్వేల్లో ముఖ్యమంత్రి జగన్ను ప్రధానంగా రెండు జిల్లాలు కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలపై సీరియస్ గా..
రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను మార్చాలని సర్వే నివేదికలివ్వడంతో అందుకు సీఎం సన్నాహాలు చేసుకుంటున్నారు. చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, వేమూరు, తాడికొండ, మంగళగిరి, సత్తెనపల్లి, పొన్నూరుతోపాటు ప్రకాశం జిల్లాలోని సంతనూతనలపాడు, పర్చూరు, కొండెపి, మార్కాపురం, యర్రగొండపాలెం.. తదితర నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను మార్చాలని సర్వే సంస్థలు సూచించినట్లు సమాచారం.

పనితీరు మార్చుకోకపోతే ఉపేక్షించేదే లేదు!
చిలకలూరిపేట నుంచి విడుదల రజని, సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు, వేమూరు నుంచి మేరుగ నాగార్జున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి రావాలంటే కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిలను మార్చడంతోపాటు కొన్ని కటువైన నిర్ణయాలు తీసుకోవాలని సర్వేలో స్పష్టం కావడంతో అందుకు ముఖ్యమంత్రి ఉద్యుక్తులవుతున్నారు. పనితీరు మార్చుకోనివారు మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా ఎవరినీ ఉపేక్షించేది లేదని, రానున్న ఎన్నికల్లో గెలుపే ప్రధాన అంశంగా సీట్లు కేటాయిస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

నియోజకవర్గం మార్చే ఆలోచన?
ఈ రెండు జిల్లాలకు సంబంధించిన పార్టీ సీనియర్ నేతలతో ఆయన సమావేశమై పరిస్థితి గురించి చర్చించినట్లు సమాచారం. పనితీరు మార్చుకోవడానికి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఆరునెలల సమయం ఇస్తున్నట్లు కొన్నాళ్ల క్రితం ఎమ్మెల్యేలతో జరిగిన వర్క్ షాప్లో ప్రకటించారు. అయితే ఈ మంత్రులను నియోజకవర్గం మార్చి పోటీ చేయించే ఆలోచన కూడా ఉన్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications