తొలి ఓటు సీఎం జగన్ దే - అసెంబ్లీకి చంద్రబాబు : వైసీపీ ఎమ్మెల్యేకు టీ అసెంబ్లీలో ఓటు..!!
రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ నుంచి తొలి ఓటు సీఎం జగన్ వినియోగించుకోనున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్ధి ముర్ముకు వైసీపీ - టీడీపీ మద్దతు ప్రకటించాయి. సభలోని మొత్తం 175 మంది సభ్యుల్లో వైసీపీకి 151, టీడీపీకి 23 మంది ఉన్నారు. ఒక ఓటు జనసేనకు ఉన్నా.. ఆ ఓటు సైతం ముర్ముకు మద్దతుగా ఉండే అవకాశం ఉంది. దీంతో.. రాష్ట్రంలో ఏకపక్షంగా ఒకే అభ్యర్ధి వైపు మొగ్గు చూపటం ఖాయంగా కనిపిస్తోంది.
వైసీపీ కార్యాలయంలో మాక్ పోలింగ్
అసెంబ్లీ ప్రాంగణంలోని వైసీపీ కార్యాలయంలో తొలుత మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తరువాత సభ్యులంతా అసెంబ్లీలో పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. ముందుగా సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ తరువాత మిగిలిన ఎమ్మెల్యేలు ఓటు వేయనున్నారు, వైసీపీ నుంచి మంత్రి బుగ్గనతో పాటుగా అసెంబ్లీ వ్యవహారాల సమన్వయకర్త శ్రీకాంత్ రెడ్డి ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల పోలింగ్ లో పొల్గొనేలా ఏర్పాట్లు చేసారు. బ్యాలెట్ మీద పోటీలో ఉన్న యశ్వంత్ సిన్హా.. ముర్ము పేర్లలో ఎవరికి మద్దతు ఇస్తారో వారి పేరు ఎదుట ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ మాత్రమే వినియోగించి ఒకటి అంకె వేయాల్సి ఉంటుంది.
తొలి ఓటు వేయనున్న సీఎం జగన్
ఇక, చాలా రోజుల తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ కార్యాలయం నుంచి అసెంబ్లీకి చేరుకుంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలకు మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. రెండు పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ లో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం పోలింగ్ ప్రక్రియను వీడియో తీయనున్నారు. రేపు బ్యాలెట్ బాక్సును ఢిల్లీకి తరలిస్తారు. ఇక, ఏపీకి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కందుకూరు శాసనసభ్యుడు మహీధర్ రెడ్డి కూడా ఓటింగ్ కోసం హైదరాబాద్ ఐచ్ఛికంగా ఇచ్చారు. ఆయన కూడా ఇక్కడే తన ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ముర్ము వైపే ఏకపక్షంగా పోలింగ్
ఇక, పోలింగ్ కోసం కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పూర్తి కట్టుదిట్టమైన భద్రత మధ్య రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో 16వ రాష్ట్రపతి ఎన్నికకు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన పోలింగ్ ఏర్పాట్లను కేంద్రం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఎన్నికల పర్యవేక్షకుడు చంద్రేకర్ భారతి (ఐఏఎస్), ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ సంతోష్ అజ్మీరా(ఐఐఎస్)లు ఆదివారం పరిశీలించారు. వారు తొలుత సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్కుమార్ మీనాతో సమావేశమై పోలింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం శాసనసభ ప్రాంగణంలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.