జగన్ ప్రభుత్వం లెక్కలు- వ్యూహాలు: అమరావతి అభివృద్ధికి రుణం : ఆ భూములమ్మి అప్పు తీర్చేలా..!!
అమరావతి కేంద్రంగా జగన్ ప్రభుత్వం కొత్త లెక్కలు వేస్తోంది. అమరావతిలో మౌళిక వసతుల కల్పన - అభివృద్ధికి రుణ సేకరణకు సిద్దమైంది. ఈ మేరకు డీపీఆర్ సైతం సిద్దం చేసింది. అయితే, ఆ డీపీఆర్ లో పేర్కొన్న అంశాలే ఇప్పుడు రాజకీయంగా- పాలనా పరంగా కీలక చర్చకు కారణమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం తన మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా ఆమోదించిన బిల్లులను గత అసెంబ్లీ సమావేశా ల్లో ఆకస్మికంగా ఉప సంహరించుకుంది. దీనికి సంబంధించి హైకోర్టులో కేసులు కొనసాగుతున్న వేళ... బిల్లుల ఉప సంహరణ పైన అఫిడవిట్ ను సమర్పించింది.

అమరావతిలో మౌళిక వసతులపై
అందులో అమరావతిలో పది వేల కోట్ల రూపాయాల రుణంతో మౌళిక వసతుల కల్పనకు నిర్ణయం గతంలోనే జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. తాజాగా మరింత రుణ సేకరణ ద్వారా అమరావతిలో మౌళిక వసతులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. ఇక, ఇప్పుడు అమరావతిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటుగా ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధికి బ్యాంకుల నుంచి దాదాపు మూడు వేల కోట్ల రూపాయాల మేరు రుణం పొందేందుకు ఒక డీపీఆర్ సిద్దం అయింది. ఈ రుణం తీర్చే విధానాన్ని ఆ డీపీఆర్ లో పొందు పరిచారు. అమరావతిలోని 481 ఎకరాల భూమిని దశలవారీగా విక్రయించి రుణం, వడ్డీని తిరిగి చెల్లిస్తామని అందులో పేర్కొంది. చట్టసభల్లో సీఆర్డీఏ రద్దు బిల్లు ఆమోదం పొందినా..గవర్నర్ ఆమోదంతో ఈ నెల 13న చట్టంగా మారింది. దీంతో..ఈ డీపీఆర్ ను అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారానే సమర్పించినట్లు తెలుస్తోంది.

డీపీఆర్ లో ఆసక్తి కర అంశాలు
కొంత కాలం క్రితం అమరావతిలో ప్రధానంగా కల్పించాల్సిన మౌళిక వసతులు.. అభివృద్ధికి గతంలో రూపొందించిన ప్రణాళికల్ని రూ.11,092 కోట్లకు కుదించింది. ఈ మొత్తంలో రూ.10వేల కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది. తొలి దశలో రూ.3వేల కోట్లు, రెండో దశలో రూ.3వేల కోట్లు, మూడో దశలో రూ.4వేల కోట్ల రుణం తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. తొలి దశలో మూడు వేల కోట్ల రుణానికి సంబధించి తిరిగి చెల్లింపు అవకాశాలను డీపీఆర్ లో స్పష్టం చేసింది. రాజధానిలో తొలి దశలో చేపట్టాలనుకుంటున్న పనుల విలువ రూ.3,760.04 కోట్లు గా పేర్కొంది. దానిలో రుణం రూ.2,994.46 కోట్లు కాగా, ప్రభుత్వ వాటా రూ.765.58 కోట్లుగా స్పష్టం చేసింది.

అమరావతిలో ఎకరా ఏడు కోట్లకు
ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించి రూ.650.58 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి చేసారు. తొలి దశలో ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులకు రూ.1,206.39 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధికి రూ.1,788.07 కోట్లు వెచ్చిస్తారు. విద్యుత్ లైన్ల ఏర్పాటుకి రూ.115 కోట్లు వెచ్చిస్తారు. దాన్ని ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. ఈ పనులను పూర్తి చేయటానికి 18 నెలల కాల పరిమితిగా నిర్ణయించారు. అయితే, బ్యాంకుల నుంచి తీసుకునే రుణానికి సంబంధించి మొదటి రెండున్నరేళ్లు మారటోరియం ఉండేలా, ఆ తర్వాత పదిహేనేళ్లలో సంవత్సరానికి కొన్ని ఎకరాల చొప్పున రాజధానిలో మొత్తం 481 ఎకరాలను విక్రయించి రుణం, వడ్డీ చెల్లించేలా డీపీఆర్ లో పేర్కొన్నట్లుగా సమాచారం.

అక్కడ భూములు అమ్మి అప్పు తీర్చేలా
రుణం తీసుకున్న తర్వాత... మూడో సంవత్సరంలో 47 ఎకరాలను విక్రయిస్తామని తెలిపింది. అప్పుడు రాజధానిలో భూమి విలువ ఎకరం రూ.7 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. అలా 18వ సంవత్సరంలో ఆరు ఎకరాలను విక్రయిస్తామని, అప్పటికి భూమి విలువ ఎకరం రూ.17.74 కోట్లు ఉంటుందని పేర్కొంది. అంటే రాజధానిలో భూముల విలువ మూడేళ్ల కాలంలో ఎకరం ఏడు కోట్లకు చేరుతుందని అంచనా వేయటం ద్వారా..అక్కడ విలువ ఏ స్థాయిలో పెరిగేది అందులో స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ అంశం రాజకీయ చర్చకు దారి తీస్తోంది.

జగన్ కొత్త లెక్కలు..వ్యూహాలు
దీని ద్వారా అమరావతి భూముల పైన రుణ సేకరణ..అమ్మి రుణం తీరుస్తామని చెప్పటం ఒక అంశమైతే...ఏ స్థాయిలో అమరావతిలో భూముల విలువ పెరిగేదీ చెప్పటం ద్వారా ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కొత్త లెక్కలు తెర మీదకు తెచ్చినట్లుగా విశ్లేషణలు మొదలయ్యాయి. వైసీపీ మినహా అన్ని పార్టీలు అమరావతికి అనుకూలంగా ఉన్న సమయంలో.. మూడు రాజధానుల బిల్లును మరింత సమగ్రంగా సభ ముందుకు తీసుకొస్తామంటూ ప్రకటించిన సీఎం జగన్.. ఇప్పుడు అమరావతిలో అభివృద్ధి దిశగా వేగంగా వేస్తున్న అడుగుల వెనుక భారీ రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ మొదలైంది.












Click it and Unblock the Notifications