ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ - సీఎం జగన్ సంకేతాలు క్లియర్ : ఢిల్లీ - అమరావతి..!!
ఏపీలో ఎన్నికలకు ముమూర్తం ఫిక్స్ అయింది. స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్లీనరీ వేదికగా ఎన్నికలకు సిద్దం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడనేది బయటకు చెప్పకపోయినా..వైసీపీ ముఖ్య నేతలకు మాత్రం దీని పైన స్పష్టమైన సమచారం..పక్కా లెక్కలు ఉన్నాయి. దీంతో..ఈ ప్లీనరీ ముగింపుతో ఎన్నికలకు సమాయత్తం అవటం మొదలు పెడుతున్నారు. అందులో భాగంగా సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
రచ్చబండ పేరుతో ఎంతో కాలంగా జిల్లాల పర్యటనలు చేయాలని భావించినా .. సాధ్యపడలేదు. దీంతో..ఇప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి..తన పాలన పైన స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకొనేందుకు సిద్దం అవుతున్నారు. పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్దం చేసే బాధ్యతను స్వయంగా తీసుకుంటున్నారు. ఇందు కోసం ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం సిద్దం అవుతోంది.
షెడ్యూల్ కంటే ముందుగానే
ఏపీలో ఊహించిన విధంగా ముందస్తుగానే ఎన్నికలు ఖాయమని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరిగేలా ..పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుగానే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ మాసంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన ఉండేలా పక్కా గా కార్యాచరణ సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పాలనా పరంగా పెండింగ్ నిర్ణయాలు...డెవలప్ మెంట్ - ఉద్యోగాల భర్తీకి అనుగుణంగా కొన్ని కీలక నిర్ణయాలను పూర్తి చేయనున్నట్లు సమాచారం.
లెక్క పక్కా.. వ్యూహాత్మకంగా
అదే సమయంలో సీపీఎస్ తో పాటుగా మద్యపాన నిషేధం రెండు హామీల అమలు ఇప్పుడు ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి. వీటి పైనా కసరత్తు జరుగుతోంది. వచ్చే ఏడాది తెలంగాణతో పాటుగా మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో..గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించిన తీరులోనే ఇప్పుడు సీఎం జగన్ సైతం ఏపీలో ఆరు నెలల ముందస్తుకు సిద్దం అవుతున్నారని చెబుతున్నారు.
దీని ద్వారా అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసుకొని..అప్పుడు పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం కావాలనేది వైసీపీ వ్యూహంగా స్పష్టం అవుతోంది. ఇందు కోసం ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది. ప్లీనరీ వేదికగా సీఎం జగన్ ఎన్నికలకు సిద్దం కావాలంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
అన్నీ కలిసొస్తే..ఏడాదిలోనే ఎన్నికలు
175 సీట్లలో గెలుపు సుసాధ్యమే అంటూ ధీమా వ్యక్తం చేసారు. తన ఎన్నికల నినాదాన్ని ఖరారు చేసారు. ప్రతిపక్ష టీడీపీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు..లబ్ది దారుల సంఖ్య..జరుగుతున్న ప్రయోజనాలు తనకు పూర్తిగా అనకూల ఓటింగ్ కు కారణమవుతాయనే లెక్కల్లో సీఎం జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది.
లబ్ది దారులంతా తన సైన్యంగా జగన్ అభివర్ణించారు. నిజంగా.. లబ్ది దారులంతా జగన్ వైపే నిలిస్తే..వైసీపీ గెలుపు సునాయమసే అని విశ్లేషణలు మొదలయ్యాయి. పార్లమెంట్ కంటే అసెంబ్లీ ఎన్నికలు ముందుగానే నిర్వహించాలనే ఆలోచనల పైన ఢిల్లీ స్థాయిలోనూ చర్చలు..ఆ తరువాతనే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. వైసీపీ శ్రేణుల్లో జరుగుతున్న చర్చల మేరకు వచ్చే ఏడాదే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి.