చిరంజీవి సమర్ధతకు పరీక్ష-సీఎం జగన్ ఆహ్వానం : ఆన్ లైన్ టిక్కెట్ల పై ఒప్పిస్తారా..!!
టాలీవుడ్ పెద్దలకు సీఎం జగన్ అప్పాయింట్ మెంట్ ఫిక్స్ అయింది. చిరంజీవి నాయకత్వంలో టీం తెలుగు సినీ పరిశ్రమ సమస్యలను సీఎం కు వివరించేందుకు ముహూర్తం ఖరారు చేసారు. కొంత కాలంగా చిరంజీవి అండ్ పెద్దలు తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పైన ముఖ్యమంత్రిని కలిసి పరిష్కారానికి కోరాలని భావిస్తున్నారు. ఈ సమయంలో విషయం ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నానిని సంప్రదించగా సీఎం అప్పాయింట్ మెంట్ ఖరారు చేస్తామని చెప్పారు. దీంతో..ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించాల్సి అంశాల పైన చిరంజీవి సినీ పెద్దలతో సమావేశమయ్యారు.
సీఎంతో చిరంజీవి టీం చర్చల పై ఆసక్తి
అనేక అంశాల పైన 24 ఫ్రేమ్స్ పెద్దల నుంచి సలహాలు తీసుకున్నారు. అందులో భాగంగా..గత సమావేశంలో కరోనా వేళ ధియేటర్ల సమస్యలు...కార్మికుల వెతలతో పాటుగా విద్యుత్ ఛార్జీలు..పన్నుల వంటి విషయంలో మినహాయింపులు ఇవ్వాలని చిరంజీవి టీం సీఎంను కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. ఇక, ఇప్పుడు మరోసారి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ఏవి ప్రస్తావించాలనే దాని పైన ఇప్పటికే చిరంజీవి నాయకత్వంలో టీం సిద్దం అయింది.
సినీ పెద్దలతో కలిసి మెగాస్టార్ సిద్దం
ఏ,బీ,సీ సెంటర్లలో ధియేటర్లు..సినిమాల విడుదల వేళ ఇండస్ట్రీ కోరుకుంటున్న అంశాలు..విద్యుత్ ఛార్జీల్లో రాయితీలు వంటివి ప్రభుత్వం నుంచి మినహాయింపు కోరాలని నిర్ణయించారు. అదే విధంగా విశాఖలో సినీ పరిశ్రమ గురించి చర్చకు వచ్చే అవకాశం ఉంది .గతంలోనే చిరంజీవి రెండు సార్లు ఏపీ సీఎం జగన్ తో సమావేశమై చర్చలు చేసారు. రెండో సారి సమావేశమైన సమయంలో నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సీ కళ్యాణ్, దగ్గుబాటి సురేష్ ఉన్నారు. దీంతో..మోహన్ బాబు, బాలక్రిష్ణ కు ఆహ్వానించకపోవటం పైన టాలీవుడ్ లో చర్చ జరిగింది.
బాలయ్య-మోహన్ బాబు కలుస్తారా
ఈ సారి మీటింగ్ కు వారు వస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక, ఈ సమావేశంలో ప్రధానంగా తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఆన్ లైన్ లో సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన చర్చకు రానుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా..ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరూ ఈ నిర్ణయం పైన స్పందించలేదు. ముఖ్యమంత్రితో చర్చల సమయంలోనూ దీని పైన చర్చించాలనే అభిప్రాయంతో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ఒకే రేటు అమలు చేసేలా ఆన్ లైన్ లో టిక్కెట్ల విక్రయానికి నిర్ణయం తీసుకుంది.
ఆన్ లైన్ టిక్కెట్ల పైన జగన్ ఆలోచిస్తారా
ఇందు కోసం కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరికీ అవకాశం కల్పించ లేదు. ప్రభుత్వమే సింగిల్ థియేటర్ నుంచి మల్టీ ప్లెక్స్ వరకు అన్నింటా టిక్కెట్లు విక్రయిస్తే తమకు నష్టమనే అభిప్రాయం సినీ ఇండస్ట్రీ లో వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం టిక్కెట్లను విక్రయించిన తరువాత నిర్వహణ ఛార్జీలను మినహాయించి..మిగిలిన మొత్తం ఎవరికి ఏ మేర ఇవ్వాలో ఇవ్వనుంది. అయితే, టాలీవుడ్ కు హైదరాబాద్ తో పాటుగా ఏపీ మార్కెట్ కీలకం. ఇక్కడ అనేక ధియేటర్లు...మల్టీప్లెక్స్ లు కొందరు పెద్దల చేతిలోనే ఉన్నాయి.
సీఎం ఒప్పించే బాధ్యత మెగాస్టార్ పైనే...
ఈ నిర్ణయాన్ని ఎలాగైనా ప్రభుత్వం విత్ డ్రా చేసుకొనే విధంగా చేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అదే విధంగా ప్రముఖ హీరోల సినిమాల విడుదల సమయంలో ప్రత్యేక షో లు... అదనపు ధరలకు టిక్కెట్ల విక్రయం వంటి విషయాల పైన ఏపీ ప్రభుత్వం కఠినంగా ఉంది. దీంతో..వీటన్నింటి పైనా ఈ సారి జరిగే సమావేశంలో ముఖ్యమంత్రిని ఒప్పించి పాత విధానం కొనసాగేలా ప్రయత్నం చేయాలని సినీ పెద్దల ప్లాన్ గా తెలుస్తోంది. కానీ, ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం పైన పునరాలోచన చేస్తారా అనేది సందేహమే.
Recommended Video
చిరంజీవి సమర్ధతకు పరీక్షగా...
అయితే, సీఎం ను ఒప్పించే బాధ్యతను సినీ పెద్దలు చిరంజీవి పైనే పెడుతున్నారు. దీంతో..ఇక, ఇప్పుడు ఈ నెల 20న చిరంజీవి టీం ను అమరావతిలో జరిగే సమావేశానికి రావాలంటూ ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికం గా ఆహ్వానం పంపారు. ఈ సమావేశంలో చిరంజీవి టీం చేసే ప్రతిపాదనలపైన సీఎం జగన్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారనేది అటు సినీ ...ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తి కరంగా మారుతోంది.