ఆ రెండు జిల్లాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు: ఇబ్బంది ఉండవచ్చు : జాగ్రత్తతో వ్యవహరించాలి..!
ఒక వైపు రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రతిపాదనల పైన భిన్న పరిస్థితులు..మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికలు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు రాజధాని అంశంపైన రిఫరెండంగా భావించాలంటూ డిమాండ్ ..అమరావతి ప్రాంత జిల్లాల పైనే ఇప్పుడు అందరి ఫోకస్. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ ఇన్ ఛార్జ్ మంత్రులతో సమావేవమయ్యారు. అభ్యర్దుల ఎంపిక నుండి గెలుపు వరకు వారికే బాధ్యత అప్పగించారు. ఈ సమయంలోనే కృష్ణా.. గుంటూరు జిల్లాల్లోని పరిస్థితుల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. సమన్వయం చేసుకోవాలని మంత్రులకు నిర్దేశించారు. ఇక, ముందస్తుగా జడ్పీ చైర్మన్ అభ్యర్థుల పైన హామీలు ఇవ్వద్దని ..ఎన్నికలు పూర్తయ్యే వరకూ జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం నిర్దేశించారు.
ఆ రెండు జిల్లాల్లో ఇబ్బంది పైనా..
ముఖ్యమంత్రి జగన్ ఇన్ ఛార్జ్ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. జిల్లాల్లో జిల్లాపరిషత్, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికల వరకు పార్టీ విజయం బాధ్యత పూర్తిగా వారిదేనని స్పష్టం చేసారు. అదే సమయంలో ఎన్నికలన్నీ పూర్తయ్యేవరకూ వారంలో నాలుగురోజులు అప్పగించిన జిల్లాల్లోనే ఉండాలని ఆదేశించారు. ఇక, ప్రస్తుతం అమరావతి నుండి పాలనా రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల నేపథ్యంలో రాజధాని పరిధిలోని కృష్ణా.. గుంటూరు జిల్లాల్లో పరిస్థితి పైనా స్పందించారు.
ఈ రెండు జిల్లాల్లో కొంత ఇబ్బంది ఉండవచ్చని సీఎం అంచనా వేసారు. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అక్కడ రాజకీయంగా ఇబ్బంది ఉంటుందనే భావన సీఎం మాటల్లో వ్యక్తం అయినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఇబ్బంది ఉన్నా.. ప్రజలు తమతోనే ఉన్నారని సీఎం వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
ముందస్తుగా ప్రకటించవద్దు
ఇక..అభ్యర్ధుల ఎంపిక నుండి ఎంపీపీ..జడ్పీ ఛైర్మన్ వరకు ఎవరికీ ఎక్కడా హామీలు ఇవ్వదని ముఖ్యమంత్రి జగన స్పష్టం చేసారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎమ్మెల్యేకి..ఎమ్మెల్యేకి తేడా ఉంటుందని చెబుతూ.. తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలున్న చోట పరిస్థితి మరికొంత క్లిష్టంగా ఉండొచ్చు. వాటన్నింటిని జాగ్రత్తగా సమన్వయం చేయాలి అని మంత్రులకు సీఎం సూచించారు.
వారంలో మూడు రోజులు మాత్రమే సొంత జిల్లాలు..లేదా నియోజకవర్గాల పని కోసం కేటాయించాలని..మిగిలిన సమయం ఎన్నికల మదే ఫోకస్ చేయాలని స్పష్టం చేసారు. అదే సమయంలో జడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో గెలుపు గుర్రాలెవరో గుర్తించాలని సూచించారు. జడ్పీ చైర్మన్ అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించవద్దని, ఈ విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాలన్నారు.
సీఎం వ్యాఖ్యలపైనే చర్చ..
ముఖ్యమంత్రి జగన్ ఆ రెండు జిల్లాల్లో ఇబ్బంది ఉండవచ్చని సూచించటం..అయినా ప్రజలు తమతోనే ఉన్నారని చెప్పటం ద్వారా ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూనే..గెలుపు పైన ధీమా వ్యక్తం చేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి గ్రామాల్లో మొదలైన ఆందోళన జాతీయ రహదారుల మీదకు చేరింది. తాజాగా విజయవాడ నగరంలోకి ఎంటరై..ఇప్పుడు బస్సు యాత్రల ద్వారా ఇతర జిల్లాల్లోకి వెళ్తోంది.
అయితే, అమరావతి నుండి పాలనా రాజధాని తరలిస్తే ఈ రెండు జిల్లాల్లో మాత్రమే ప్రభావం ఉంటుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఇదే సమయంలో రాయలసీమలో తమకు రాజధాని దూరం అవుతోందనే వాదన తెర మీదకు వచ్చింది. తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. సీమలో ఇటువంటి డిమాండ్లు ఉన్నా..రాజకీయంగా మాత్రం నష్టం ఉండదని..దీనిని త్వరలోనే అధిగమిస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.