విశాఖ వైపు ప్రపంచం చూపు - ప్రతిష్ఠాత్మకం : సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!
విశాఖ వైపు ఇప్పుడు ప్రపంచం చూస్తోందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా వచ్చే రెండు నెలల కాలంలో రెండు ప్రపంచ స్థాయి సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సుల ఏర్పాట్ల పైన ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. పలు కీలక సూచనలు చేసారు. మార్చిలో ముందుగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.. తరువాత జీ20 సన్నాహక సదస్సుకు విశాఖ వేదిక కానుంది. ఈ రెండు సదస్సులకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 350 మంది ప్రముఖులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఏర్పాట్ల నిర్వహణతో పాటుగా పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసారు.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా..
ముఖ్యమంత్రి జగన్ మంత్రులు..ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మార్చి 3-4 తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై ఆరా తీసారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు జరగాల్నారు. 2014-2019 మధ్య రూ. 18.87 లక్షల కోట్లకు ఎంఓయూలు చేసుకుంటే వాస్తవానికి ఆ మధ్యకాలంలో ఏడాదికి పెట్టుబడులు సగటున రూ.11,994 కోట్లు వచ్చాయని అధికారులు వివరించారు. అదే విధంగా.. 2019-2022 మధ్య సగటున ఏడాదికి పెట్టుబడులు రూ. 15,693 కోట్లు వచ్చాయని వెల్లడించారు. 2019 జూన్ నుంచి ఇప్పటివరకూ రూ.1,81,821 కోట్ల పెట్టుబడులురాగా, 1,40,903 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి వాస్తవిక పెట్టుబడులు లక్ష్యంగా సదస్సు ముందుకు సాగాలని నిర్దేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను సమగ్రంగా వివరించేలా కార్యక్రమం రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఊతం ఇవ్వాలి
ప్రపంచ వ్యాప్తంగా కొత్త తరహా ఉత్పత్తుల తయారీకి ఏపీ వేదిక కావాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఇందుకు గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ఊతం ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహణ పైన రోడ్ షో లు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళ్లిన సమయంలో అక్కడి పారిశ్రామిక వాడలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. వాటి నిర్వహణపైన అవగాహన పెంచుకోవాలన్నారు. ఎంఎస్ఎంఈల నిర్వహణ పైన అధ్యయనం చేయాలన్నారు. మార్చి 28-29 మధ్య విశాఖపట్నంలో జి-20 సన్నాహక సదస్సు జరగనుంది. దీని ఏర్పాట్లు పైనా సీఎం సమీక్ష చేసారు. ఒక్కొక్క జీ-20 సభ్యదేశం నుంచి 6గురు చొప్పున హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల నుంచి నలుగురు చొప్పున హాజరవుతారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 100 మంది ప్రతినిధులు హాజరవుతారని అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ రెండు సదస్సుల నిర్వహణ వేళ విశాఖ లో తీసుకోవాల్సిన చర్యల పైన ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసారు.

విశాఖ నగరం పై సీఎం సూచనలు
సమావేశం కోసం విశాఖపట్నం నగరాన్ని అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. అవసరమైన రోడ్లు, సుందరీకరణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని స్పష్టం చేసారు. ప్రధాన జంక్షన్లు, బీచ్ రోడ్డులో సుందరీకరణ పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆతిథ్యం, రవాణా తదితర ఏర్పాట్లల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసారు. ఆతిథ్య..నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. నిర్వహణ కోసం ఒక మొబైల్ యాప్ ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. ప్రతినిధులకు భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెట్టబడులకు ఏపీలో ఉన్న అవకాశాలపై ప్రతినిధులను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.












Click it and Unblock the Notifications