ఈ సాయం చేయండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ..
లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో పారిశ్రామిక రంగాన్ని ఆదుకునేందుకు ఆర్థిక చేయూత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ పరిస్థితి,ఆర్థిక వ్యవస్థ కుదేలైన తీరుపై ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. చాలావరకు పరిశ్రమల్లో ఉత్పత్తి స్తంభించిపోయిందని.. కార్మికులు,రవాణా లేకపోవడంతో పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రభావం పడిందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో 94శాతం చిన్న,మధ్య తరహా పరిశ్రమలు మూతబడ్డాయని లేఖలో పేర్కొన్నారు. కేవలం 6 శాతం ఎంఎస్ఎంఈలు 25 నుంచి 30 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపారు. వీటిని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని.. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.
పీఎఫ్, ఈఎస్ఏ, గ్రాట్యుటీ చెల్లింపుల్లో 6 నెలల పాటు మారటోరియం విధించాలని విజ్ఞప్తి చేశారు. వడ్డీ చెల్లింపుల నుంచి వెసులుబాటు కల్పించేలా ఆర్బీఐ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎంఎస్ఎంఈలు తీసుకున్న అన్ని రుణాల వాయిదా చెల్లింపులపై 12 నెలలు మారటోరియం విధించాలన్నారు. ఎంఎస్ఈల పెండింగ్ చెల్లింపులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే వాటి విద్యుత్ చెల్లింపులను కేంద్రం మాఫీ చేయాలని చెప్పారు. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు జీఎస్టీ చెల్లింపులు ఏడాది పాటు వాయిదా వేయాలని కోరారు.
టెక్స్టైల్ రంగాన్ని ఆదుకోవడానికి రుణాల వడ్డీ రేటు తగ్గించాలన్నారు. నాలుగు త్రైమాసికాల రుణాల చెల్లింపులపై మారటోరియం విధించాలన్నారు. టెక్స్టైల్ పరిశ్రమలు యాంటీ డంపింగ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ చెల్లింపుల నుంచి మినహాయింపు కోరుతున్నాయని పేర్కొన్నారు.