మంత్రివర్గ ప్రక్షాళన: మాజీలు- ఎమ్మెల్సీలకు ఛాన్స్ : అప్పలరాజుకు పిలుపు..!?
AP Cabient Reshuffle:ఏపీ కేబినెట్ విస్తరణకు రంగం సిద్దం అవుతోంది. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్వయంగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ సంకేతాలు ఇచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ ముఖ్య నేతల సమాచారం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో అయిదుగురిని తప్పిస్తారని తెలుస్తోంది. వారి స్థానంలో ప్రాంతీయ - సామాజిక సమీకరణాల ఆధారంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల్లో ముగ్గురు..ఇద్దరు మాజీలకు అవకాశం ఇస్తారని సమాచారం.
కేబినెట్ ప్రక్షాళన దిశగా...
ఏపీ కేబినెట్ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పట్టభద్రులు - ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలో కీలక నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో - ప్రభుత్వం లో మార్పులు ఖాయమని చెబుతున్నారు. మంత్రివర్గంలో అయిదుగురు పని తీరు పైన సీఎం అసహనంతో ఉన్నారని ప్రచారం సాగుతోంది. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తరువాత నిర్ణయం తీసుకుంటారని కొద్ది కాలంగా ప్రచారం సాగుతోంది. ఇక, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల వేళ ఫలితాలు - చోటు చేసుకున్న రాజకీయం పరిగణలోకి తీసుకొని కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సమీకరణాలే కీలకంగా..
ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో అయిదుగురి వరకు మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఉభయగోదావరి జిల్లాల నుంచి ఇద్దరు, అమరావతి ప్రాంతం నుంచి ఒకరు, సీమ జిల్లాల నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి ఒకరిని మార్చే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. వీరి స్థానంలో ప్రాంతీయ - సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా కొత్త వారి ఎంపిక ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ..సామాజిక సమీకరణాలు ప్రభావం చూపే ప్రాంతాల్లో అవసరమైన విధంగా మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు. అందులో భాగంగానే గోదావరి జిల్లాలో కాపు -బీసీ-ఎస్సీ వర్గాలను ప్రభావితం చేసే నేతలకు ఛాన్స్ ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
మాజీలు -ఎమ్మెల్సీలకు ఛాన్స్
తాజాగా జరిగే విస్తరణలో మాజీ మంత్రులు కొడాలి నాని - బాలినేని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇద్దరికి తిరిగి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. అదే విధంగా తోట త్రిమూర్తులు పేరు పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక, మంత్రి అప్పలరాజుకు సీఎం నుంచి పిలుపు వచ్చింది. మంత్రివర్గ విస్తరణ వార్తల నేపథ్యంలో ఆయనకు తాడేపలికి రావాలనే పిలుపు రాజకీయంగా చర్చకు కారణం అవుతోంది.అప్పలరాజుకు సంబంధించిన శాఖ పరమైన అంశంపైనే చర్చలకు పిలిచారని మంత్రి అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో.. కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీని పైన పార్టీ అధికారికంగా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.












Click it and Unblock the Notifications