విశాఖ కేంద్రంగా సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!!
ముఖ్యమంత్రి జగన్ విశాఖ కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో ఉన్న సీఎం మరో అడుగు ముందుకేస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఏపీ హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆదేశించటంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు పైన సుప్రీంలో ఎస్ఎస్ఎల్పీ దాఖలు చేసింది. దీని పైన సుప్రీం ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. ఒక వైపు న్యాయ పోరాటం సాగిస్తూనే..విశాఖ కేంద్రంగా సీఎం ముందుకు కదులుతున్నారు.
ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా
అందులో భాగంగా..రానున్న ఉగాది నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి పాలన ప్రారంభిచాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి ఇదే అంశానికి సంబంధించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేయవచ్చని స్పష్టం చేసారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే మంత్రులు ఉంటారని, మంత్రులు ఉన్నచోటే సచివాలయం ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. మంత్రులు అమర్నాధ్.. బొత్సా లాంటి వారు కూడా త్వరలోనే విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభం అవుతుందంటూ పలు సందర్బాల్లో వెల్లడించారు.

న్యాయపరమైన అడ్డంకులు లేకుండా
విశాఖ గర్జన తరువాత రాష్ట్రంలో అనూహ్యంగా రాజకీయ పరిణామాల్లో మార్పు కనిపిస్తోంది. రాష్ట్రంలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు పర్యటన సమయంలోనూ అమరావతికే కర్నూలు జిల్లా ప్రజలు మద్దతుగా నిలుస్తారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో కర్నూలు న్యాయ రాజధానిగా డిమాండ్ చేస్తూ చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. మూడు రాజధానుల ప్రతిపాదనను ఏపీలో విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అమరావతికి మద్దతుగా వచ్చే నెలలో భారీ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

సీఎం - మంత్రులు విశాఖ నుంచే
ఇదే సమయంలో వికేంద్రీకరణ సరైన నిర్ణయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికార వైసీపీ సిద్దం అవుతోంది. అందులో భాగంగా.. వచ్చే నెలలో కర్నూలులో గర్జనకు నిర్ణయించింది. ఇప్పటికే లోకాయుక్త, ఏసీబీ కోర్టు వంటివి కర్నూలు కేంద్రంగా ఏర్పాటు చేసారు. హైకోర్టు తరలింపు వ్యవహారంపైన సుప్రీం కోర్టులో కేసు తేలే వరకు స్పష్టత వచ్చే అవకాశం లేదు. దీంతో, ముఖ్యమంత్రే విశాఖ నుంచి పాలన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో తీర్పు కూడా తమకు అనుకూలంగా వస్తుందనే అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారు. కోర్టు తీర్పు ఆలస్యం అయినా.. న్యాయపరంగా సీఎం విశాఖ కేంద్రంగా పాలనకు అడ్డంకులు లేకపోవటంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications