త్వరలో ఏపీ సీఎంవో ప్రక్షాళన ? రాజధాని తరలింపుకు ముుందే జగన్ టీమ్ లో మార్పులు ?
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను మరో నెల రోజుల్లో వేగవంతం చేయాలని భావిస్తున్న సీఎం జగన్ ఆ లోపే సీఎంవో ప్రక్షాళనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. రాజధానుల తరలింపులో చురుగ్గా పనిచేసే అధికారుల కోసం వెతుకుతున్న జగన్ ఆ మేరకు సీఎంవో టీమ్ లో మార్పులు చేయనున్నట్లు సమాచారం.
జగన్ స్పీడ్ అందుకునే వారికే అవకాశాలు
ఏపీలో గతేడాది వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సీఎం జగన్ తన టీమ్ లో పలు మార్పులు చేస్తూనే ఉన్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే టీమ్ కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా తన స్పీడ్ ను అందుకోలేని వారిని తప్పిస్తూ కొత్తగా మరికొందరిని తన టీమ్ లోకి ఆహ్వానిస్తూనే ఉన్నారు. మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఆర్పీ సిసోడియాతో పాటు మరికొందరు అధికారుల బదిలీలే ఇందుకు నిదర్శనం. అయితే కొన్నిసార్లు పొరబాటు చేశామని భావిస్తే మాత్రం గతంలో సీఎంవో నుంచి బదిలీ చేసిన వారిని సైతం అక్కున చేర్చుకునేందుకు జగన్ సిద్దమవుతున్నారు. ఆర్పీ సిసోడియా తిరిగి సీఎంవోలోకి రావడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.
కీలక స్ధానాల్లో సమర్ధులకే చోటు
ఏపీలో వైసీపీ సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి గతంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంంగా పలు కార్యక్రమాల రూపకల్పన చేసింది. వీటిని ప్రస్తుతం దేశంలోని పలు రాష్ట్రాలు తామూ అమలు చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. అటువంటి పరిస్ధితుల్లో సీఎం జగన్ స్పీడ్ తో పాటు ఆలోచనలకు తగినట్లుగా పనిచేసే వారికే సీఎం అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగని ఓసారి తీసుకున్నాక వారిని పూర్తిగా వదిలేయడం లేదు. ఎప్పటికప్పుడు పనితీరును మదింపు చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కడైనా తన ఆలోచనలకు తగినట్లుగా లేకపోతే, ప్రభుత్వ విధానాల అమల్లో సమర్ధంగా వ్యవహరించకపోతే మాత్రం బదిలీ వేటు తప్పడం లేదు. ముఖ్యంగా నవరత్నాలను తూ.చా తప్పకుండా అమలు చేసి తీరాల్సిందేనని జగన్ చెప్తున్నారు.
Recommended Video
మరోసారి సీఎంవో ప్రక్షాళన తప్పదా ?
ప్రస్తుతం మూడు రాజధానుల ప్రక్రియ మొదలైనా కోర్టుల అభ్యంతరాలు, మండలిలో బిల్లుల వ్యవహారం, అలాగే రాజధాని వ్యవహారంపై మీడియాలో తామర తంపరగా నెగెటివ్ వార్తలు రావడం సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. అలాగే కీలక జీవోల జారీ వ్యవహారంలో జీఏడీ సమర్ధంగా వ్యవహరించలేకపోతోందనే వాదన ఉండనే ఉంది. స్ధూలంగా చూస్తే న్యాయ, మీడియా విభాగాలు సమర్ధంగా పనిచేయకపోవడం వల్లే కోర్టుల్లో ప్రతీ విషయానికీ అక్షింతలు వేయించుకోవాల్సి వస్తోందని, అలాగే మీడియాతో సత్సంబంధాలు నెరపకపోవడం వల్లే నెగెటివ్ వార్తలను అడ్డుకోలేకపోతున్నామని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇంగ్లీష్, జాతీయ మీడియా ప్రభుత్వ వైఫల్యాలను భూతద్దంలో చూపిస్తున్నా సలహాదారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న సాధారణ జనం నుంచే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపుకు ముందే సీఎంవోలో జగన్ తన టీమ్ ను ప్రక్షాళన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి చూస్తే న్యాయ, మీడియా విభాగాల వ్యవహారాలు చూస్తున్న కొందరిపై వేటు తప్పదని తెలుస్తోంది. విశాఖకు కొత్త టీమ్ తోనే వెళ్లాలనే ఉద్దేశం జగన్ మాటల ద్వారా అర్దమవుతోందని తాజాగా సీఎంను కలిసిన వారు చెప్తున్నారు.